నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక మళ్లీ వాయిదా, 45 రోజులపాటు.., ఆగస్ట్ ఫస్ట్వీక్లో జరిగే ఛాన్స్..
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మరోసారి వాయిదా పడింది. లాక్డౌన్ వల్ల ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా పడుతూ వస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి.. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో శాసనమండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దీనిపై భూపతిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. మండలి చైర్మన్ నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు నామినేషన్ కూడా దాఖలు చేశారు. కానీ కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించడంతో ఎన్నిక నిర్వహణ వాయిదా కొనసాగుతోంది.
కరోనా ఎఫెక్ట్: కవితకు నిరీక్షణ తప్పదు.. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మళ్లీ వాయిదా..
మార్చి 12న నోటిఫికేషన్..
మార్చి 12వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. మరో నలుగురు కూడా నామినేషన్ వేశారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 7వ తేదీన ఎన్నిక జరగాలి. కానీ లాక్ డౌన్ వల్ల ఎన్నిక వాయిదాపడింది. లాక్ డౌన్ 4.0లో సడలింపులు ఇచ్చినా.. ఇప్పట్లో ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సుముఖంగా లేదు.
45 రోజులు వాయిదా
మరో 45 రోజులపాటు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. దీంతో ఆగస్ట్ మొదటివారంలో ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ధృవీకరించారు. సీఈసీ లేఖ రాసిందని, ఆ మేరకు 45 రోజులపాటు వాయిదా వేస్తున్నామని తెలిపారు.
కవిత వర్సెస్ లక్ష్మీనారాయణ
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుగురు బరిలో ఉన్నా.. ప్రధానంగా కవిత, లక్ష్మీనారాయణ మధ్యే పోటీ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ రెడ్డి ఏ మేరకు ప్రభావం చూపిస్తారో చూడాలి. మిగతా వారి ప్రభావం అంతగా ఉండే అవకాశం లేదు. పరిస్థితిని బట్టి ఎన్నికల్లో కవిత విజయం ఖాయమని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ ఎన్నిక మాత్రం వాయిదాపడుతూ వస్తోంది. ఎమ్మెల్సీగా కవిత.. ఎన్నికైతే మంత్రివర్గంలోకి వెళతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ తర్వాత.. మూడో మహిళా మంత్రి పదవీ చేపట్టే చాన్స్ ఉంది.