జగన్తో కేసీఆర్ కుమ్మక్క: కృష్ణ జలాలను అమ్మేశారు, తెలంగాణ సీఎంపై అర్వింద్ విమర్శలు
సీఎం కేసీఆర్పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైరయ్యారు. ఏపీ సీఎం జగన్తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కృష్ణ జలాలను జగన్కు కేసీఆర్ అమ్మేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోతిరెడ్డిపాటు సామర్థ్యం పెంచుతామని ఏపీ సర్కార్ జీవో ఇచ్చిన మిన్నకుండిపోయారని మండిపడ్డారు. ఇప్పటివరకు కంపెనీలు/పరిశ్రమలను బెదిరించిన కేసీఆర్.. ఇప్పుడు రైతులను బెదిరిస్తున్నారని విమర్శలు చేశారు.
చెప్పిన పంట పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అర్వింద్ తెలిపారు. తెలంగాణలో వరి పంట ఎక్కువగా సాగు చేస్తారని.. ఇప్పుడు అవసరాలు, డిమాండ్, సప్లై అని కహానీలు చెబుతున్నారని మండిపడ్డారు. చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు ఇవ్వబోమని చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలతో మొక్కజొన్న రైతులు మనస్తాపానికి గురయ్యారని చెప్పారు. రైతు బంధు పేరుతో ఇప్పుడు వ్యవసాయ రంగంలో అవినీతికి తెరతీశాడని విమర్శిస్తున్నారు.
పనిలో పనిగా జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఆయన చేసిందేమీ లేదన్నారు. బీజేపీతో పెట్టుకుంటే టీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని చెప్పారు. వలస కార్మికుల వ్యవహారంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తుచేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం అన్నీ వర్గాలకు బాసటగా ఇస్తామని తేల్చిచెప్పింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటుందని వివరించారు. అసదుద్దీన్ ఓవైసీ దేశద్రోహి అని విరుచుకుపడ్డారు. ఆ పార్టీ దేశద్రోహ కార్యకలాపాలు నిర్వహిస్తుందని ఆరోపించారు.