ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ మృతికి కేసీఆర్ కారణం.. బీజేపీ ఎంపీ అర్వింద్ ఫైర్
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. కార్మికులకు బీజేపీ నేతలు ఫుల్ సపోర్టుగా నిలుస్తున్నారు. ఆ క్రమంలో వారి ఆందోళన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. అటు కాంగ్రెస్ లీడర్లు కూడా సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఖమ్మం డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మరణానికి.. సీఎం కేసీఆర్ కారణమంటూ ఆరోపించారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా హైదరాబాద్లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎంపీ అర్వింద్తో పాటు మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ నేత జి.వివేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై అర్వింద్ నిప్పులు చెరిగారు.
రాసిచ్చిన స్క్రిప్టులేనా.. మంత్రుల సేమ్ డైలాగ్స్.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఖతర్నాక్ ప్లాన్..!
నియంతృత్వ పాలనతో సీఎం కేసీఆర్ అరాచకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు అర్వింద్. సొంత కుటుంబం కోసం పాకులాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ఫైరయ్యారు. కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు డబ్బు వ్యామోహం బాగా పెరిగిపోయిందని ధ్వజమెత్తారు.
అహంకార పూరిత ధోరణి మంచిది కాదని.. ఆ విషయం చాలా సందర్భాల్లో స్పష్టమైనప్పటికీ కేసీఆర్ కుటుంబానికి ఇంకా తగిన బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. వారి అహంకారం వల్లే నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓడిపోయారని.. భవిష్యత్తులో కేసీఆర్కు కూడా అదే గతి పడుతుందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని.. అయినా కేసీఆర్ సర్కార్ కూలిపోయినా బాధపడే వారు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు.