మున్సిపల్ ఎన్నికల్లో ఆ పని చేస్తే నిజామాబాద్ పేరు మారుస్తా : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ టీఆర్ ఎస్ ను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన నిజామాబాద్ కార్పొరేషన్లో గెలుపొంది.. మేయర్ పదవిని చేపడితే నిఆమాబాద్ పేరు మారుస్తామని చెప్పారు.
నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని బీజేపీ మేనిఫెస్టో
మొదట నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించిందని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు . అధికార టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ మేయర్ స్థానాన్ని ఎంఐఎంకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. గురుకులాల్లో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయన్నారు.కార్పోరేషన్పై జెండా ఎగరవేస్తే పనుల విషయంలో ఎలాంటి కమిషన్లు ఉండవని, అభివృద్ధి నిధులు పక్కదారి పట్టకుండా చూస్తామన్నారు.
నిజామాబాద్ పట్టణం చుట్టూ ఔటర్ రింగ్రోడ్డు నిర్మిస్తామని హామీ
ఇరవై ఏళ్లలో చేయని అభివృద్ధిని రెండేళ్లలో చూపిస్తామని పేర్కొన్న ఆయన బీజేపీ మేయర్ పీఠం గెలిచిన వెంటనే తొలి సంతకం నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తూ తీర్మానం చేస్తామన్నారు. అదేవిధంగా బీజేపీ గెలుపొందితే నిజామాబాద్ పట్టణం చుట్టూ ఔటర్ రింగ్రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చింది.నిజామాబాద్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, పట్టణంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపింది. కేంద్రం నిధులతో నిజామాబాద్ కార్పొరేషన్ను అభివృద్ధి చేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రకటించారు.
కేటీఆర్కు రాజకీయ పరిజ్ఞానం లేదన్న ఎంపీ అరవింద్
కేటీఆర్కు రాజకీయ పరిజ్ఞానం లేదని విమర్శించారు. మోదీని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు. భైంసా ఘటనలకు వ్యతిరేకంగా తాను శనివారం నాడు ఒకరోజు నిరాహార దీక్ష తలపెడితే పోలీసులు అనుమతి లేదంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. కచ్చితంగా భైంసా ఘటనలకు నిరసనగా దీక్ష చేస్తామని చెప్పారు . ఏ బిల్లులో తేవాలో, ఏం చెయ్యాలో కేటీఆర్ దగ్గర తాము ట్యూషన్ చెప్పించుకునే అవసరం వారికి లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు.