కల్వకుంట్ల కవితః మార్చి 1, న్యూఢిల్లీ..!
నిజామాబాద్ః నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. లింగ సమానత్వం అంశంపై ఐక్యరాజ్యసమితి నిర్వహించబోయే సదస్సులో ఆమె ప్రసంగించబోతున్నారు. ఈ తరహా సదస్సులో పాల్గొని, ప్రసంగించబోయే తొలి తెలంగాణ మహిళా లోక్ సభ సభ్యురాలు కవితే కావడం విశేషం. మార్చి 1వ తేదన ఏర్పాటు కానున్న ఈ సదస్సుకు దేశ రాజధాని వేదికైంది.
యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్, గ్లోబల్ నెట్ వర్క్ ఇండియా సంయుక్తగా ఈ సదస్సును నిర్వహించబోతున్నాయి. లింగ సమానత్వం అనే అంశంపై కవిత ప్రసంగిస్తారు. ఉపాధి, నైపుణ్య రంగాల్లో మహిళలు పురోగమించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అంశాలపై చర్చిస్తారు. ఉపాధి కల్పన దిశగా తెలంగాణ ప్రభుత్వం సహా దేశంలోని ఇతర రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను ఆమె ఈ సదస్సులో ప్రస్తావిస్తారు.
దీనికి సంబంధించిన వివరాలను ఆమె తెలంగాణ ప్రభుత్వం నుంచి తెప్పించుకుంటున్నారు. క్రియేటివిటీ, శాస్త్రీయబద్ధమైన ఆలోచనలతో మహిళలకు కల్పించాల్సిన ఉపాధి అవకాశాలతో పాటు, వారు ఉత్పత్తి చేసిన వస్తువుల మార్కెటింగ్, లింగ సమానత్వం వంటి అంశాలు ఈ సదస్సులో చర్చకు రానున్నాయి. పారిశ్రామిక విప్లవం, వ్యాపార రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఆటోమేషన్, బిగ్ డేటా, దేశంలో యువత ఆయా రంగాల్లో తగిన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం తదితర అంశాలపై జీఈఎస్ 2019లో చర్చిస్తారు. బహుళ జాతి సంస్థ డెలాయిట్ ఈ సదస్సుకు నాలెడ్జ్ పార్ట్ నర్గా పనిచేస్తోంది.