28 కోట్ల లాటరీ.. నిజామాబాద్ వాసికి గల్ఫ్ జాక్పాట్..!
నిజామాబాద్ : గల్ఫ్ కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయినవారిని అందర్నీ వదిలేసి.. ఏడు సముద్రాలు దాటేసి.. జీవనపోరాటంలో అష్టకష్టాలు పడుతుంటారు. దూరపు కొండలు నునుపు అన్న చందంగా అక్కడికి వెళ్లాక కూడా గల్ఫ్ కార్మికులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రిక్కాల విలాస్కు అదృష్టం కలిసొచ్చింది. ఇన్నాళ్లు అరకొర సంపాదనతో నెట్టుకొస్తున్న అతడికి లక్కీ లాటరీ తగిలింది.
గల్ఫ్ రిటర్న్ కార్మికుడికి లక్కీ లాటరీ
లక్కీ లాటరీ.. పేరుకు తగ్గట్టుగానే విలాస్ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారంలా మారింది. అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు అనే దానికి ఇతనే పెద్ద నిదర్శనం. జీవనపోరాటంలో గల్ఫ్ బాట పట్టిన విలాస్కు ఉద్యోగం దొరక్క తిరుగుప్రయాణమైన నేపథ్యంలో అక్కడ కొన్న లాటరీ టికెట్ అదృష్టం రూపంలో తలుపు తట్టింది.
హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కథ.. మరెన్నో నిజాలు.. నిందితుడు మామూలోడు కాదుగా..!
దుబాయ్లో ఉద్యోగం దొరకలేదు కానీ.. లక్కీ లాటరీ తగిలింది
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లికి చెందిన రిక్కాల విలాస్, పద్మ దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు హిమాని ఇంటర్మీడియట్ చదువుతుండగా.. రెండో కూతురు మనస్విని 8వ తరగతి చదువుకుంటోంది. అయితే వీరి కుటుంబం జీవనోపాధి కోసం వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ఆ క్రమంలో ఆదాయం సరిపోవడం లేదని విలాస్ 45 రోజుల కిందట దుబాయ్కు వెళ్లాడు. కానీ అక్కడ ఉద్యోగం దొరక్క.. తిరిగి స్వస్థలానికి తిరిగొచ్చాడు.
దుబాయ్ ఎయిర్పోర్టులో ప్రతినెల బిగ్ టికెట్ పేరుతో లాటరీ నిర్వహిస్తుంటారు. దాదాపు 28 కోట్ల రూపాయలకు పైగా ప్రైజ్మనీ ఇస్తారు. ఆ క్రమంలో ఇదివరకు దుబాయ్లో డ్రైవర్గా పనిచేసిన విలాస్ రెండు సంవత్సరాలుగా ఆ టికెట్లు కొన్నాడు. కానీ, ఏనాడు ఆ లక్కీ లాటరీ తగల్లేదు. అయితే ఇటీవల దుబాయ్లో ఉద్యోగం దొరక్క తిరిగొచ్చిన తర్వాత కూడా ఆ టికెట్ కొనే అలవాటు మాత్రం మానుకోలేకపోయాడు. తన దగ్గర డబ్బులు లేకుంటే.. భార్య పద్మ దగ్గర 20 వేల రూపాయలు అడిగి తీసుకుని మరీ లాటరీ టికెట్లు కొన్నాడు. తన మిత్రుడికి అమౌంట్ పంపి టికెట్లు కొనుగోలు చేశాడు.
28 కోట్ల 40 లక్షలు.. జాక్ పాట్ తగిలిందిగా
దుబాయ్లో ఉంటున్న తన మిత్రుడి ద్వారా మూడు టికెట్లు కొనుగోలు చేశాడు విలాస్. అయితే అనూహ్యంగా అందులో ఒక టికెట్కు జాక్పాట్ తగిలింది. విలాస్ విలాసవంతమైన జీవితం గడిపేందుకు దోహదపడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28 కోట్ల 40 లక్షల రూపాయల నగదు విలాస్ సొంతం కానుంది. ప్రతి నెల దుబాయ్ ఎయిర్పోర్టులో తీసే లక్కీ లాటరీ జులై నెలకు గాను విలాస్ను వరించిందన్నమాట. అలా ఇన్నాళ్లు అరకొర సంపాదనతో.. అష్టకష్టాలు పడుతున్న విలాస్ ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయాడు.
దుబాయ్లో విలాస్ భారీ లాటరీ గెలుపొందినట్టు అతడికి ఫోన్ వచ్చింది. ఈ లాటరీలో విలాస్ ఏకంగా 4.08 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 28 కోట్ల 40 లక్షలు సొంతం చేసుకున్నాడు. ఆ మేరకు బిగ్ టికెట్ వెబ్ పోర్టల్లో కూడా వివరాలు వెల్లడించారు. దాంతో అతడి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.