ఆ గులాబీ ఎంపీలకు పెద్ద కష్టం ; పదవిలో ఉన్నా పార్టీకి దూరంగా, సైలెన్స్ వెనుక పెద్ద కథే !!
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయా? వివిధ జిల్లాలలో అధికార పార్టీలో ఉన్న ఎంపీలు కూడా సైలెంట్ గా ఉంటున్న పరిస్థితి నెలకొందా ? పార్టీలో ఆధిపత్య పోరు నేపథ్యంలో చాలామంది సీనియర్లు ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా అంటే అవును అనే సమాధానమే వస్తుంది. రాజ్యసభ సభ్యుల మాట అయితే సరేసరి. ఒకప్పుడు జిల్లాలో చక్రం తిప్పిన నాయకులు రాజ్య సభ సభ్యులుగా అవకాశం దక్కినా సైలెంట్ గా ఉండడం పై ప్రతి జిల్లాలోనూ ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇందూరు జిల్లాలో హస్తం పార్టీలో కీలక నేతలుగా ఉండి, వివిధ కారణాలతో టిఆర్ఎస్ బాట పట్టిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు అధికారిక కార్యక్రమాలకు కూడా డుమ్మా కొడుతూ, తమకేం సంబంధం లేదన్నట్లుగా ఉంటున్నారు. ఈ ఇద్దరు ఎంపీలపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది. గులాబీ పార్టీ లో రాజ్యసభ పదవి వారికి అచ్చి రావటం లేదు అన్న చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది.
హస్తం పార్టీలో చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ లో సైలెంట్
ఒకప్పుడు నిజామాబాద్ రాజకీయాలను శాసించిన పరిచయం అక్కరలేని నాయకులు ధర్మపురి శ్రీనివాస్, సురేష్ రెడ్డి. వాళ్లిద్దరూ హస్తం పార్టీలో కీలక నేతలుగా కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు అధికారం కట్టబెట్టారు. రాజకీయ చతురత ఒకరిదైతే.. అసెంబ్లీ సాక్షిగా ట్రెండ్ సెట్ చేసిన నాయకుడు ఇంకొకరు. ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్యేలుగా రాష్ట్ర స్దాయిలో చక్రం తిప్పి ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. ఒకరిని గులాబీ పార్టీ దూరం పెడితే.. మరొకరు ఆ పార్టీలోకి చేరి రాజకీయాలకు దూరమయ్యారనే టాక్ నిజామాబాద్ జిల్లాలో జోరుగా వినిపిస్తుంది.
పదవిలో ఉండి కూడా రాజకీయాలకు దూరంగా గులాబీ రాజ్యసభ ఎంపీలు
పదవిలో ఉండి కూడా ఆ నేతలు ప్రజలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అన్న చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక వారు అధికారిక కార్యక్రమాలకు కూడా రాని పరిస్థితి, రాజకీయంగా వారి మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. నిజామాబాద్ జిల్లాలో రాజ్యసభ పదవి ఆ జిల్లాకు అచ్చి రావడం లేదనే ప్రచారము పెద్ద ఎత్తున సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఈ లీడర్లు ఎమ్మెల్యేలుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారని టాప్ ఉంది. ఒకరు పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లు అధికారం ఇచ్చిన క్రెడిట్ ఖాతాలో వేసుకోగా, మరొకరు ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ గా ట్రెండ్ సెట్ చేసిన ఘనత దక్కించుకున్నారు.
ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పిన డీ. శ్రీనివాస్, సురేష్ రెడ్డి
ఎమ్మెల్యేలుగా జిల్లాను ఒంటిచేత్తో నడిపిన డీ. శ్రీనివాస్, సురేష్ రెడ్డి గులాబీ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యులు అయ్యాక పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు అని స్థానికంగా చర్చ జరుగుతుంది. వారిద్దరూ ప్రత్యేక పరిస్థితుల్లో వేరువేరుగా గులాబీ పార్టీలో చేరిన యాదృచ్ఛికంగా ఇద్దరు నేతలకు రాజ్యసభ ఎంపీగా అవకాశం దక్కింది. ఆ పదవులే వారిని ప్రజలకు దూరం చేశాయని టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన డి. శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. హస్తం పార్టీకి రాజీనామా చేసి.. టిఆర్ఎస్ పార్టీలో చేరారు. డి.ఎస్. కు రాజ్యసభ పదవి ఇచ్చి తగిన గౌరవం ఇచ్చారు ఆ పార్టీ అధినేత కేసీఆర్.
డీఎస్ పై గులాబీ అంతర్గత పోరు .. కవిత టార్గెట్ చెయ్యటంతో ఉనికి కోల్పోయిన డీఎస్
ఆ తర్వాత పార్టీలో తగిన ప్రాధాన్యం లేకపోవడం, అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం పట్ల ఆయన అసంతృప్తితో అంతర్గతంగా విభేదాలు పొడసూపాయి . ఇదే సమయంలో డి.ఎస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మూకుమ్మడిగా సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. ముఖ్యంగా కవిత కూడా డీ. శ్రీనివాస్ ను టార్గెట్ చేశారు. ఎమ్మెల్యేల లేఖతో మనస్ధాపం చెందిన డీ ఎస్ అప్పటినుండి పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాను ఏ పార్టీలో ఉన్నానో తనకే తెలియదని సందర్బం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు డి.ఎస్. పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండే డి.ఎస్. గులాబీ పార్టీ చేరి.. ప్రత్యక్ష రాజకీయాల్లో కనుమరుగయ్యారు. రాజ్యసభ పదవి ఉన్నా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలతో బయట కార్యక్రమాలకు వెళ్లడం లేదు. యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న డీఎస్ ఉనికి కోల్పోతున్నారని టాక్ ఉంది.
అసెంబ్లీ స్పీకర్ గా కీలకంగా పని చేసిన సురేష్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా సైలెంట్
ఉమ్మడి రాష్ట్రానికి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన కే.ఆర్. సురేష్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు గులాబీ తీర్దం పుచ్చుకున్నారు. మూడు దశాబ్దాలుగా హస్తం పార్టీలో పనిచేసిన సురేష్ రెడ్డి.. బాల్కొండ, ఆర్మూర్ నుంచి పలు మార్లు ఎమ్మెల్యేగాఎన్నికై మంత్రిగా.. స్పీకర్ గా కాంగ్రెస్ ప్రభుత్వంలో పని చేశారు.పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండే సురేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గాన్నిచుట్టొచ్చే స్థానికంగా పట్టున్న నాయకుడు. గులాబీ పార్టీ నుంచి రాజ్యసభ పదవి పొంది ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిన సురేష్ రెడ్డి కూడా ఇప్పుడు అధికారిక కార్యక్రమాలకు సైతం డుమ్మా కొడుతున్నారని టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్న నేత.. టీఆర్ఎస్ లో చేరి సైలెంట్ కావడం వెనుక అసలు కారణం ఏంటో అని తెలియక ఆయన అనుచరులు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. రాజ్యసభ వేదికగా మాత్రం తన వాయిస్ వినిపిస్తున్న సురేష్ రెడ్డి నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు నేపథ్యంలో జిల్లాలో సైలెంట్ గా ఉన్నట్లు టాక్ .
నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో పట్టు కోల్పోతున్న నేతలు .. భవిష్యత్ రాజకీయాలపై చర్చ
ఒకప్పుడు ఎమ్మెల్యేలుగా నియోజవర్గంలో తిరిగిన నేతలు, ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా అధికారం చేతిలో ఉన్నా కూడా ప్రజలకు, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా కావడం పట్ల నేతల అనుచరులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీలో కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని, అధికారం చేతిలో ఉన్న అందరికి ప్రాధాన్యత దక్కదని స్థానికంగా చర్చించుకుంటున్నారు. మరి కొందరు మాత్రం జిల్లాకు రాజ్యసభ పదవి అచ్చి రావడం లేదని చెబుతున్నట్లు సమాచారం. ఇందూరు రాజకీయాలను ఒకప్పుడు శాసించిన ఈ నేతలు రాబోయే రోజుల్లో కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేదా ట్రెండ్ మారుస్తారా అనేది వేచి చూడాలి.