maruthi rao suicide: ఆస్తి వివాదాలు లేవు, మే 15 నుంచి అన్నతో మాట్లాడటం లేదు: శ్రవణ్
మారుతీరావు ఆత్యహత్యకు సోదరుడు శ్రవణ్తో విభేదాలే కారణమని ప్రచారం జరుగుతోంది. కుమారులపై ఆస్తి రాయాలని ఒత్తిడి తీసుకురావడంతో సూసైడ్ చేసుకున్నారనే ఊహాగానాలకు శ్రవణ్ తోసిపుచ్చారు. చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించానని శ్రవణ్ మీడియా ముందు వాపోయాడు. ప్రణయ్ హత్య కేసులో తనకు సంబంధం లేదని.. కానీ 7 నెలల 15 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు తన సోదరుడు ఆత్మహత్య చేసుకుంటే తనపై నిందలు వేయడం సరికాదన్నారు.
చేయని తప్పుకు..
చేయని తప్పుకు జైలు జీవితం అనుభవించానని.. మీడియా ప్రతినిధులు నిర్ధారించుకొని రాయాలని సూచించారు. ఏప్రిల్లో జైలు నుంచి బయటకు వచ్చామని.. తర్వాత మారుతీరావుతో పెద్దల పంచాయతీ జరిగిందన్నారు. ప్రణయ్ హత్య కేసులో తనను ఇరికించారని గొడవ పడ్డానని చెప్పారు. పెద్దలు అయ్యిందెదో జరిగిందని సర్దిచెప్పి పంపించారని తెలిపారు. మే 15వ తేదీ నుంచి తన అన్న మారుతీరావుతో మాటలు లేవని చెప్పారు. కానీ తెరపైకి ఆస్తి రాయాలని తీసుకురావడం బాధ కలిగిస్తోందని మీడియాకు చేతులు జోడించి విన్నవించారు.
డ్రైవర్ ఫోన్ చేయడంతో..
సోదరుడు చనిపోయాడని డ్రైవర్ ఫోన్ చేస్తే వదినను తీసుకొని ఆస్పత్రికి వచ్చానని గుర్తుచేశారు. అంతే తప్ప లేని విషయాన్ని ఉన్నట్టు రాయడం సరికాదన్నారు. ఎవరి భూములు జాగాలు వారి పేరు మీద ఉన్నాయని శ్రవణ్ పేర్కొన్నారు. తన వయస్సు 57 ఏళ్లు అని.. తాము చిన్న పిల్లలమా..? ఆస్తి కోసం గొడవ పడేందుకు అని ప్రశ్నించారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, లేనిపోని ఆరోపణలు చేస్తే.. తనకేం జరిగినా పిల్లలు అనాధలు అయిపోతారని పేర్కొన్నారు.
వదినకే ఆస్తి..
తన పిల్లలపై 2018 మార్చిలో వీలునామా రాశారని శ్రవణ్ చెప్పారు. ఆస్తిలో 50 శాతం వారికే దక్కుతోందని రాయగ.. పెద్ద మనుషులతో బలవంతం చేసి వద్దని చెప్పానని పేర్కొన్నారు. దీంతో వీలునామా క్యాన్సిల్ చేసుకున్నారని పేర్కొన్నారు. కానీ తాను మాత్రం వీలునామా చూడలేదని మీడియాకు శ్రవణ్ పేర్కొన్నారు. తాను సంపాదించుకున్నదే ఉందని.. ఆస్తి కోసం గడ్డి తిననని స్పష్టంచేశారు. మారుతీరావు ఆస్తి అతని భార్యకే చెందుతోందని పేర్కొన్నారు.