‘కారు’తోనే సయోధ్య: బీజేపీలోకి వలసలు అంతా ఉత్తదే...
2019లో తమదే అధికారమని, తమ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి భారీగా నేతలు వలసలు వస్తున్నారని బీజేపీ తెలంగాణ నాయకులు ఊదరగొట్టారు.
హైదరాబాద్: 2019లో తమదే అధికారమని, తమ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి భారీగా నేతలు వలసలు వస్తున్నారని బీజేపీ తెలంగాణ నాయకులు ఊదరగొట్టారు. 'పెద్దలొస్తున్నారు.. సర్దుకోండి' అని పార్టీలోని నేతలకు హితబోధ చేసినట్లు మీడియాకు లీక్లు వచ్చాయి.
ఇక రాష్ట్ర బీజేపీ బలం పెరిగిపోతుందని మీడియాలో హైప్ ప్రచారం సాగింది. కానీ అదంతా ఉత్తిదేనని తేలిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ బీజేపీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలెవ్వరూ సిద్ధంగా లేరని కమలనాథులు ఆరా తీసినప్పుడు తేలిపోయింది.
ఇదిగో.. అదిగో వచ్చేస్తున్నారంటూ సాగిన ప్రచారం చివరకు ఎవరూ రావడం లేదని తేలిపోవడంతో కమలనాథులు నిరుత్సాహానికి గురయ్యారని వినికిడి. వాస్తవ పరిస్థితిని పసిగట్టడంలో ముందు ఉండే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పట్లో తెలంగాణలో పర్యటించే అవకాశాలు లేవని సమాచారం. అధికార టీఆర్ఎస్ పార్టీతోనే ఎన్నికల అవగాహనకు సిద్ధపడుతున్నారని ఆ పార్టీ వర్గాల కథనం.
డీకే అరుణతో లక్ష్మణ్ సహచరులకు చివాట్లు
బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ కే లక్ష్మణ్ వచ్చిన తర్వాత ‘కమలంలోకి ‘ఆపరేషన్ ఆకర్ష్' ప్రచారం జోరుగా సాగింది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బారీగా కమలం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అప్పట్లో బహిరంగంగా మీడియా ముందే డాక్టర్ కే లక్ష్మణ్ ప్రకటించారు. 40 మంది కాంగ్రెస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో ఓటమి పాలైన వారు, సిట్టింగ్ ఎమ్మెల్యేల జాబితాను రూపొందించి, వారితో సంప్రదింపులతో లక్ష్మణ్ తన అనుచర గణాన్ని రంగంలోకి దించారని వార్తలొచ్చాయి. ఈ ఆపరేషన్ ఆకర్ష్లో ఎవ్వరూ బీజేపీలో చేరేందుకు ముందుకు రాలేదని వినికిడి. చివరకు గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణతో జరిపిన సంప్రదింపుల్లో ఆమెతో ‘చీ' కొట్టించుకున్నారని తెలియవచ్చింది. ఈ విషయమై బీజేపీపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అప్పట్లోనే నిప్పులు చెరిగారు.
కోయిల ముందే కూసిందన్నట్లు పబ్లిసిటీ
అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా లేరని తేలింది. ఆ పార్టీలోని అసంత్రుప్త నేతలు, గత ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించి భంగ పడిన వారు, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు వస్తాయో, లేదోనని మదనపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆహ్వానాలు పంపిందని సమాచారం. ఈ ఆఫర్ ను టీఆర్ఎస్ నేతలు తిరస్కరించారని తెలుస్తున్నది. ఈ నెలలో ఆరు రోజుల పాటు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని ఈ సందర్భంగా ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. దీనిపై అమిత్ షాకు కూడా బీజేపీ రాష్ట్ర శాఖ నివేదిక పంపారని ఆ వర్గాల కథనం. ఒకవేళ బీజేపీలో చేరాలని భావించే ఇతర పార్టీల నాయకులు తమ భవితవ్యాన్ని నిర్ధారించుకున్న తర్వాత ముందడుగు వేస్తారని సమాచారం.
దత్తన్నను క్యాబినెట్ నుంచి తప్పించిందే ఇందుకా?
ఆయన సొంతంగా వాకబు చేసిన తర్వాత అటువంటి పరిస్థితి లేదని ఆలస్యంగా నిర్ధారించుకున్న తర్వాత తమను పార్టీ తెలంగాణ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని, లేని బలం ఉన్నట్లు చూపుతున్నారని.. ఆ ప్రయత్నాలు మానుకోవాలని చివాట్లు పెట్టారని సమాచారం. ఇక తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎంపీ బండారు దత్తాత్రేయను క్యాబినెట్ నుంచి తప్పించడంతోపాటు అనవసర హడావుడి చేయొద్దని హెచ్చరించారని వినికిడి.
కోమటిరెడ్డి వ్యక్తిగత సర్వేలో ఇలా ఫలితాలు
కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది. అయితే వారు తమ నియోజకవర్గంలో సర్వే చేయించుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే 55, బీజేపీలోకి వెళితే 15 శాతం మద్దతు ఉంటుందని నివేదికలు రావడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ తమ ప్రయత్నం మానుకున్నారని తెలుస్తున్నది.
ఇప్పటికిప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుంచి వలసలు వచ్చినా ఇప్పటికిప్పుడు ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మారే సంకేతాలేమీ లేవు. కాకపోతే ప్రతిపక్ష పార్టీల్లో ఒకటిగా బలం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంత మాత్రానికే బీజేపీలో ఎలా చేరతామని ఆ పార్టీల నేతలు అంటున్నారు.
పోల్ మేనేజ్మెంట్పై చేతులెత్తేసిన తెలంగాణ బీజేపీ
ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తొలి నుంచి ఆరెస్సెస్ శాఖలు శ్రమించడంతో బలోపేతమైంది. దీనికి తోడు దశాబ్దాల తరబడి కాంగ్రెస్, తర్వాత ప్రాంతీయ పార్టీల జోరుతో విసిగి, వేసారిన సాధారణ కార్యకర్తలు కొందరు వైఖరి మార్చుకున్నారు. దాని ఫలితంగానే ప్రతి ఎన్నికల్లోనూ ‘పోల్ మేనేజ్మెంట్'లో ఆరితేరిన కమలనాథులు 2014 నుంచి వరుసగా విజయాలు సాధించగలుగుతున్నారు. ఇదే మంత్రాన్ని తెలంగాణలో అమలు చేయ సంకల్పించింది బీజేపీ. కానీ 2014లో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో వచ్చిన ఓట్లెన్నీ? ఎన్నినియోజకవర్గాల్లో పోల్ మేనేజ్మెంట్ చేయగలమో తెలియజేస్తూ నివేదిక సమర్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ను అమిత్ షా ఆదేశించారని వినికిడి. కానీ తన వద్ద ఎటువంటి సమాచారం లేకపోవడంతో లక్ష్మణ్ చేతులెత్తేయడం.. అమిత్ షా క్లాస్ పీకారని సమాచారం.
జానా తదితరులు చేరతారని ఊదర
ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీ, మాజీ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడు అరవింద్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాం మాధవ్ లతో సమావేశం అయ్యారు. తొలుత అరవింద్, తర్వాత డీఎస్ పార్టీలో చేరతారని ప్రచారం సాగింది. డీఎస్ రాష్ట్ర రాజకీయాల్లో తల పండిన వారు.. ఒకవేళ చేరితే కాంగ్రెస్ పార్టీలోనే చేరతారన్న వాదన వినిపిస్తున్నది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డిపైనా ప్రచారం సాగింది కానీ పప్పులు ఉడకలేదని తేలిపోయింది.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ - బీజేపీ మధ్య స్నేహ పూర్వక పోటీలు
స్వయంగా ఎదిగే అవకాశాలు లేకపోతే ప్రత్యామ్నాయంపై ద్రుష్టి సారించే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. అధికార టీఆర్ఎస్ పార్టీతోనే అవగాహన కుదుర్చుకునేందుకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో స్నేహ పూర్వక పోటీలతో బరిలోకి దిగాలని ఆయన నిర్ణయానికి వచ్చారని వినికిడి. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ ముందు ఇదే ప్రతిపాదన ఉంచారని సమాచారం. ఒకవేళ బీజేపీ అభ్యర్థులు ఓడిపోతే.. టీఆర్ఎస్ గెలిస్తే ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలన్నది ఆ లోపాయికారి ఒప్పందం సారాంశం. టీఆర్ఎస్ నాయకత్వం కూడా పరస్పరం స్నేహ పూర్వక పోటీల పేరిట క్రమంగా ఎన్డీయేకు దగ్గరవ్వడానికే ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.