మాయదారి మైసమ్మో మైసమ్మా.!నీకు బోనం ఎత్తాల వద్దా చెప్పమ్మో.!ఈ సారి బోనాలు లేనట్టే.!!
హైదరాబాద్ : మాయదారి మైసమ్మో మైసమ్మా.. నేను మైసారం పోతానే మైసమ్మా..అంటూ బోనాల పర్వదినం సందర్బంగా వినిపించే ఆ పాట తెలంగాణ ప్రజానికాన్ని ఉర్రూతలూగిస్తుంది. బోనాల పండుగ నిర్వహించుకుంటున్నారనడానికి ఆ పాటే నిదర్శనం. తెలంగాణలో కులమతాలకతీతంగా అందరూ భక్తి ప్రపత్తులతోనే కాకుండా ఉత్సాహంగా బోనాల పండుగను జరుపుకుంటారు. భాగ్య నగరంలో నెలరోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే సంబురాలకు ఎంతో విశిష్టత కూడా ఉంది.
బోనాల పండుగపై కరోనా నీడలు.. బోనాలు నిర్వహించాలా..వద్దా.. సందేహంలో తెలంగాణ ప్రభుత్వం..
తెలంగణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆషాడం మాసం మొదటి గురువారం ప్రారంభమయ్యే ఈ బోనాలు శ్రావణ మాసం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి. అలాంటి బోనాల పట్ల కరోనా నీడలు కమ్ముకునే పరిస్ధితులు తలెత్తాయి. భాగ్యనగరంలో చారిత్రాత్మక లష్కర్, లాల్దర్వాజ, గోల్కొండ, చార్మినార్ బోనాల వేడుకలకు పవిత్రమైన నేపథ్యం ఉంది. బోనం అంటే పరమ నిష్టతో తయారు చేసిన ప్రసాదం, భోజనంగా చెప్తుంటారు. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవ తలకు సమర్పించే నైవేద్యాన్నే బోనంగా సంభోదిస్తుంటారు.
తెలంగాణ ప్రజల విశిష్ట పండుగ బోనాలు.. తల్లీ బైలెల్లినావే అంటూ పవిత్రంగా జరుపుకునే పండుగ..
ఇంతటి పవిత్రమైన బోనాన్ని కొత్తకుండలో వండి, మేళ తాళాల మద్యన ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్న ముంతలో పానకం కూడా పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనం జ్యోతి వెలిగించి జాతరను కన్నులపండువగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలు కట్టివ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుం టూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలి వెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణవల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా సమస్త మానవాళిని కాపాడుతారని ప్రజల విశ్వాసం.
బోనాలంటేనే భక్తి భావం తొణికిసలాడుతుంది.. పరమ నిష్టగా బోనం వండే సంస్కృతి..
ఇలాంటి విశిష్ట చరిత్ర ఉన్న బోనాల పర్వదినాలపై కరోనా వైరస్ పంజా విసిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది బోనాలు నిర్వహిస్తారా, దా అనే సందిగ్ధం కొనసాగుతోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో దీనిపై ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి తో జరుగుతున్న సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, దేవాదాయ శాఖ కమిషనర్, ఉత్సవాల నిర్వాహకులు పాల్గొంటున్నారు.
Recommended Video
మంత్రి తలసాని ఆద్వర్యంలో సమీక్ష.. బోనాల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోనున్న టీ సర్కార్..
ఈ ఏడాది బోనాలు నిర్వహించాలా, వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యనేతలు భేటీ నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనాలే హైదరాబాద్ బోనాలు. ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా, జనాలు ఆయురారోగ్యలతో ఉండడమే కాకుండా తమను నిత్యం కాపాడాలని అమ్మవారిని కోరుకొంటూ ఏటా బోనాలు జరుపుకొంటారు. ఇప్పుడు ఏకంగా కరోనా వైరస్ ప్రపంచం పై కన్నెర్ర చేసినట్టే తెలంగాణపై విరుచుకు పడుతోంది. కరోనా భయం నీడలా వెంటాడుతున్న తరుణంలో సామూహికంగా బోనాలు జరుపుకోవడం మరింత ప్రమాదకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.