ఆ మహిళా ఎమ్మెల్యేలకు మంత్రి ఛాన్స్ లేదా ? కేసీఆర్ ఇద్దరు మహిళా మంత్రుల వ్యూహం ఇదేనా?
ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ఒకటే హాట్ టాపిక్.. తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా క్యాబినెట్ లో ఇద్దరు మహిళలకు మంత్రులుగా అవకాశం ఇస్తానని ప్రకటించారు. అయితే ఆ ఇద్దరు ఎవరు అన్నదే ప్రస్తుతం చర్చకు కారణమవుతుంది. టిఆర్ఎస్ పార్టీలో మంత్రి రేసులో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరికైనా మంత్రిగా అవకాశం దక్కుతుందా? లేక ఎమ్మెల్సీ కోటాలో అవకాశం ఇచ్చిన సత్యవతి రాథోడ్ సామాజిక సమీకరణల్లో ఎస్పీ కోటలో మంత్రివర్గంలో స్థానం దక్కించుకుంటారా? ఇక ఆపరేషన్ ఆకర్ష్ లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుండి గతంలో మాజీ మంత్రి గా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వనున్నారా ? అనేది అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లో ను హాట్ హాట్ గా జరుగుతున్న చర్చ.
ఇద్దరు మహిళలకు మంత్రిగా ఛాన్స్ ....సీఎం కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి తీసుకుంటారు అని చెప్పొచ్చు. చాలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ మహిళా మంత్రుల విషయంలోనూ వ్యూహాత్మకంగానే నిర్ణయం తీసుకున్నట్లు గా తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. కెసిఆర్ గత కేబినెట్లో మహిళలకు స్థానం ఇవ్వకపోవడం పలు విమర్శలకు దారి తీసింది. ఇక ప్రస్తుతం తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో సైతం కేసీఆర్ మహిళలకు స్థానం కల్పించలేదు. ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించిన సబితా ఇంద్రారెడ్డికి సమాధానంగా కేసీఆర్ తన మంత్రివర్గంలో మహిళలకు ఇద్దరికి అవకాశం ఇవ్వనున్నట్లు గా ప్రకటించారు. ఇద్దరికీ స్థానం ఇవ్వనున్నట్లు ప్రకటించడమే కెసిఆర్ స్ట్రాటజీ అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
సబితమ్మ టార్గెట్ గా కేసీఆర్ నిర్ణయం .. సబితా టీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి
ఇటీవల జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో సబితా ఇంద్రా రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ పై ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిన గులాబీ బాస్ సీనియర్ నాయకురాలైన సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు అని టాక్ వినిపించింది. ఇక ఆమెకు ఏకంగా మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ముఖ్య మంత్రి కేసిఆర్ అసెంబ్లీ వేదికగా ఇద్దరు మహిళలకు మంత్రిగా అవకాశం ఇస్తానని ప్రకటించడం సబితా ఇంద్రారెడ్డికి కూడా మంత్రివర్గంలో స్థానం ఉంది పరోక్షంగా చెప్పటమే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుండి సబితా ఇంద్రా రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రిగా అవకాశం దక్కించుకుంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆశావహ మహిళా ఎమ్మెల్యేల నుండి పెద్దఎత్తున అసమ్మతి వచ్చే అవకాశముంది. కాబట్టి ఒక స్థానం సబితా ఇంద్రారెడ్డికి కేటాయించడంలో భాగంగానే ఇద్దరు మహిళలకు మంత్రిగా అవకాశం ఇస్తానని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇక సబితా సైతం తన కుమారుడు కార్తీక్ రెడ్డి కి ఎంపీగా , హనకు మంత్రిగా అవకాశం ఇస్తా అంటున్న టీఆర్ ఎస్ పార్టీ లో చేరేందుకు రెడీ అవుతున్నారని టాక్ .
అనూహ్యంగా ఎమ్మెల్సీగా సత్యవతి రాథోడ్ .. ఎస్టీ కోటాలో మంత్రిగా ఛాన్స్ ఇస్తారా?
ఇప్పటికే సామాజిక సమీకరణాలలో ప్రస్తుతమున్న తెలంగాణ క్యాబినెట్ లో ఎస్టీలకు ఒక్కరికి కూడా మంత్రిగా చాన్స్ దక్కలేదు. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ అనూహ్యంగా సత్యవతి రాథోడ్ పేరును ప్రకటించారు. సత్యవతి రాథోడ్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో మంత్రిగా సత్యవతి రాథోడ్ కి చాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సత్యవతిని మంత్రిని చేసే క్రమంలోనే ఎవరు ఊహించని విధంగా ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
టీఆర్ ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు మంత్రి పదవి లేనట్టేనా ?
మరోపక్క టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి మహిళా మంత్రి పోటీలో ఉన్న పద్మాదేవేందర్ రెడ్డి , గొంగడి సునిత, రేఖ నాయక్ లకు మంత్రులుగా అవకాశం దక్కుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక సమీకరణాలలో భాగంగా ఒకవేళ సబితా ఇంద్రారెడ్డికి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రిగా అవకాశం దక్కించుకుంటే పద్మా దేవేందర్ రెడ్డి కి ఛాన్స్ ఉండకపోవచ్చు. అలాగే గొంగిడి సునీతకు కూడా సామాజిక ప్రాతిపదికనే దెబ్బ కావచ్చు. ఇక రేఖ నాయక్, సత్యవతి రాథోడ్ లలో పోటీ గమనిస్తే రాజకీయంగా, ప్రాంతాలవారీగా కల్పిస్తున్న అవకాశాలను బట్టి సత్యవతి రాథోడ్ వైపే కేసీఆర్ మొగ్గుచూపుతారు అన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. ఇదే గనుక జరిగితే టిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు మరోమారు నిరాశకు గురి కావాల్సిన పరిస్థితి.
ఇద్దరు మహిళా మంత్రులలో ఒకరు సొంత పార్టీ .. మరొకరు ప్రతిపక్ష పార్టీ నుండేనా ?
ఇద్దరికి మంత్రులు గా మహిళలకు అవకాశం ఇస్తానని ప్రకటించిన కేసీఆర్ అటు ప్రతిపక్ష పార్టీ నుండి సబితా ఇంద్రారెడ్డిని టిఆర్ఎస్ లోకి చేరేలా చేసి ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టే ఆలోచన తో పాటు, ఇటు సొంత పార్టీలోనే ఆశావహ ఎమ్మెల్యేలకు చాలా వ్యూహాత్మకంగా కారణాలు చెప్పి మొండి చెయ్యి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. గత ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన సత్యవతి రాథోడ్ కు, ఈసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వక పోవడంతో ఆమెకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటే గిరిజన సామాజిక వర్గానికి కూడా న్యాయం చేసినట్లు అవుతుందని కెసిఆర్ భావిస్తున్నారు. ఈ వ్యూహాత్మక ఆలోచనతోనే కేసిఆర్ మహిళా మంత్రులుగా ఇద్దరికి అవకాశం ఇస్తారనే ప్రకటన చేసినట్లుగా రాజకీయ విశ్లేషకుల భావన.