మావోలు మారడం లేదు, బాధాకరమే, ద్రోహం కాదు: జంపన్న కీలక వ్యాఖ్యలు
Recommended Video
హైదరాబాద్: సాధారణ జీవితం గడిపేందుకే తాము తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగుపోయామని, తమను ఎవరూ బలవంతం చేయలేదని మావోయిటు కీలక నేత జంపన్న అలియాస్ జీనుగు నరసింహారెడ్డి తెలిపారు. జంపన్న, ఆయన భార్య రజితలను డీజీపీ మహేందర్ రెడ్డి సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
జనజీవన స్రవంతిలోకి జంపన్న దంపతులు: 6రాష్ట్రాల్లో రూ.కోటి రివార్డులు
మావోయిస్టు పార్టీ అనేక సమస్యలు ఎదుర్కొంటోందని ఆపార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన జంపన్న తెలిపారు. సుదీర్ఘ విప్లవజీవితాన్ని వదులుకొని తాను, తన భార్య జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని మావోయిస్టు అగ్రనాయకత్వానికి తెలియజేశామని ఆయన పేర్కొన్నారు.
మావోయిస్టులు మారడం లేదు
సైద్ధాంతిక విభేదాలతోనే మావోయిస్టు పార్టీని వదిలేశానని, నిజాయతీ, నిబద్ధతతో పార్టీలో పనిచేశామని జంపన్న తెలిపారు. ప్రస్తుతం మారిన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ మారడంలేదని ఆయన అన్నారు. అలాగే సామాన్య ప్రజలు, విద్యార్థులు, కార్మికవర్గం దగ్గరకు పార్టీ చేరడం లేదని జంపన్న తెలిపారు.
ప్రజలకు చేరువకాలేకపోతోంది..
సమాజంలో గత 15ఏళ్లలో అనేకా మార్పులు వచ్చాయని జంపన్న తెలిపారు. ఇప్పుడు భూస్వామ్య వ్యవస్థ లేదని చెప్పారు. కాలానుగుణంగా పార్టీ మారకపోవడం, ప్రజలకు చేరువకాకపోవడంతోనే తాను పార్టీని వదిలేశానని చెప్పారు. నాయకత్వానికి సమాచారం ఇచ్చే పార్టీని వీడానని జంపన్న తెలిపారు.
మావోయిస్టులు విఫలం
తాను పార్టీలో కొంతమంది నేతలను కలిశానని, మార్పులు చేద్దామని వారు చెప్పారని, అయితే తను ఒక్కడినే మార్పు తీసుకురాలేననే అభిప్రాయంతో పార్టీని వీడానని చెప్పారు. జనంతో కలిసి పనిచేయడంలో మావోయిస్టులు విఫలమయ్యారని జంపన్న తెలిపారు.
ద్రోహం చేయలేదు.. బాధాకరమే..
తిరిగి మళ్లీ మావోయిస్టు పార్టీలో చేరేది లేదని, విప్లవ కార్యకలాపాల్లో పనిచేయడానికి సంసిద్ధతతో లేనని జంపన్న చెప్పారు. మావోయిస్టు పార్టీ ప్రజల వైపు నుంచి ఆలోచించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను మావోయిస్టు పార్టీని వీడటం ద్రోహమేమీ కాదని, తన వైపు నుంచి చూస్తే సరైన నిర్ణయమేనని అన్నారు. పార్టీని వీడటం బాధాకరమే కానీ, తప్పలేదని అన్నారు.