వెనుకడగు వేసేది లేదు.. మిగిలింది పావలా జీవితమే : కోదండరామ్
మంచిర్యాల : రెండేళ్ల పాటు ఎలాంటి ప్రతిఘటనలు లేకుండా సాఫీగా సాగిపోయిన తెలంగాణ ప్రభుత్వ పాలన, ప్రొఫెసర్ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలతో చర్చల్లో నానుతుంది. నిజానికి ఏ ప్రతిపక్ష నాయకుడో, మరొకరో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే ఇంత ప్రాధాన్యత ఉండకపోయేది. జేఏసీ ఛైర్మన్ గా, ఉద్యమ సమయంలో తెలంగాణం మొత్తాన్ని ఒక్క తాటి పైకి తెచ్చిన వ్యక్తిగా ప్రొఫెసర్ కోదండరామ్ కి ప్రజల్లో ఉన్న ఆదరణే ఈ స్థాయి చర్చకి కారణమన్నది సుస్ఫష్టం.
కాగా.. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో జరిగిన రెండేళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వ పనితీరుపై టీజేఏసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు కోదండరామ్. ఈ సందర్భంగా ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు వెనక్కి తగ్గేది లేదని స్ఫష్టం చేసిన ఆయన, ఎవరెంత రాద్దాంతం చేసినా.. ప్రజల పక్షాన పోరాటం ఆపేది లేదని తెలిపారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే మూడొంతుల జీవితం అయిపోయిందని, ఇక మిగిలిన పావలా జీవితాన్ని మాత్రం ఖచ్చితంగా తెలంగాణ కోసమే వెచ్చిస్తానని పేర్కొన్నారు. ఎవరి ప్రేరేపణలకో తలొగ్గే మనిషిని కాదని స్పష్టం చేసిన కోదండరామ్, తెలంగాణ అభివ్రుద్ది విషయంలో ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
కోదండరామ్ వెనుక తెలంగాణ వ్యతిరేక శక్తులున్నాయన్న అధికార పక్షం వ్యాఖ్యలను కోదండరామ్ ఖండించారు. అలాగే, ఓపెన్ కాస్టు బొగ్గు గనుల విషయంలో గత ప్రభుత్వాల హయాంలో జరిగినట్టే, ఇప్పుడు అదే జరుగుతుందని, ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీస్తామని తెలిపారు.
అంతేగాక, జేఏసీని విస్త్రత పరిచే చర్యల్లో భాగంగా ప్రతి మండలంలో సబ్ కమిటీలను ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై క్షేత్ర స్థాయిలో అద్యయనం చేస్తామని తెలియజేశారు. ఇదే క్రమంలో బుధవారం హైదరాబాద్ లో జరగనున్న టీజేఏసీ సమావేశంలో ఈ అంశాల పట్ల చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.