నో డ్యామేజ్, పార్టీని వీడిన వాళ్లతో నష్టం లేదు : దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్న కాంగ్రెస్, పార్టీలో నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించింది కాంగ్రెస్. ఈ సమావేశంలో పార్టీ తెలంగాణ ఇంఛార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్.. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై స్పందించారు. ఎవరో కొందరు నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన కాంగ్రెస్ కు జరిగే నష్టమేమి లేదన్నారు. కొత్త నాయకత్వం ద్వారా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తామని, ఇందుకోసం గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. పీసీసీ రెండు కమిటీల్లోను తనకు అవకాశం కల్పించారని, కానీ తాను మాత్రం సమన్వయ కమిటీ సభ్యుడిగానే కొనసాగుతానని చెప్పారు. అలాగే, పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.