ఉస్మానియా కూల్చివేతపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేతపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. భవనం కూల్చివేతను నిరోధించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో విచారణ సందర్భంగా ధర్మాసనం వెలిబుచ్చిన సందేహానికి ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (అదనపు ఏజీ) జెరామచంద్రరావు వివరణ ఇచ్చారు.
ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేతపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదని కోర్టుకు తెలియజేశారు. అదనపు ఏజీ వివరణను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం నమోదు చేసుకుంది.
ప్రభుత్వ వివరణ ఆధారంగా వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేత విషయంలో ఏదైనా నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్న పక్షంలో సమాచారాన్ని ప్రజలకు బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది.
ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేతపై ప్రభుత్వ నిర్ణయాన్ని నిలువరించాలంటూ స్వామిదాసు అనే హైద రాబాద్ నగర న్యాయవాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యం గతవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ భోసలే, జస్టిస్ ఎస్వీ భట్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఎదుటకు విచారణకు వచ్చింది. ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేతపై ఏ విధంగా నిర్థారణకు వచ్చారో తెలపాలని పిటిషనర్ తరపు న్యాయవాది సరసాని సత్యంరెడ్డిని ప్రశ్నించింది. పత్రికా కథనాల ఆధారంగా కాక కూల్చివేతపై ప్రభుత్వనిర్ణయాలు ఉంటే కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది.
తాజాగా మరోసారి మంగళవారం ధర్మాసనం విచారించింది. విచారణ ప్రారంభంలోనే ధర్మాసనం స్పందిస్తూ.. ఏవైనా ఆధారాలు ఉన్నాయా? అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆరా తీసింది. దీనిపై న్యాయవాది సత్యంరెడ్డి సమాధానమిస్తూ రాతపూర్వక పత్రాలు లేవన్నారు.
పురాతన భవనాలు శిథిలావస్థకు చేరి కూలిపోయే ప్రమాదం ఉన్నప్పుడు వాటిని కూల్చివేయడమే సబబని డిప్యూటీ సీఎం ఇటీవల చేసిన వ్యాఖ్యలను న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మానసం స్పందిస్తూ ఆ వ్యాఖ్యల్లో తప్పేముంది? అని వ్యాఖ్యానించింది.
ఆధారాలుంటేనే విచారణ చేపడుతామని స్పష్టం చేసింది. ఉస్మానియా ఆస్పత్రి భవనం చారిత్రక భవనాల జాబితాలో ఉందని, అటువంటి భవనం కూల్చివేయాలంటే తప్పనిసరిగా అనుమతులు ఆవసరమని తెలిపింది. కనీసం మరమ్మతులు చేయాలన్నా అనుమతులు కావాల్సి ఉంటుందని పేర్కొంది. అటువంటి పత్రాలు ఉంటే సమర్పించాలని న్యాయవాదికి స్పష్టం చేసింది.