వెల్ నెస్ సెంటర్స్ లో నో డాక్టర్స్ .. దీర్ఘ వ్యాధుల వాళ్ళకు వైద్యం లేక పరేషాన్
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైద్య సేవల్లో వైద్యులు బిజీగా ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబాలను సైతం వదిలిపెట్టి కరోనా పై యుద్ధం సాగిస్తున్నారు. ఇదంతా ఓకే అయినా కరోనా ఎఫెక్ట్ దీర్ఘ రోగాలతో బాధ పడుతున్న వారి మీద తీవ్రంగా పడుతుంది. బీపీ , డయాబెటిస్ వంటి దీర్ఘ రోగాలతో బాధ పడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే . ఇక ఈ క్రమంలో తాజా పరిస్థితులు వారి ఆరోగ్యం మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఇక ఉద్యోగులు, పాత్రికేయులు , పెన్షనర్లు వెల్ నెస్ సెంటర్ల వద్ద పడుతున్న బాధ వర్ణనాతీతం .
వెల్ నెస్ సెంటర్స్ లో వైద్యులు లేక పరేషాన్
దీర్ఘ వ్యాధులతో బాధ పడుతున్నవారు, నిత్యం తప్పని సరిగా మందులు వాడాల్సిన వారు వైద్యం చేయించుకోవాలని భావించినా ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా భయంతో తెరుచుకోకపోవటంతో వాళ్ళు చుక్కలు చూస్తున్నారు. ఇక ఉద్యోగులు, పెన్షనర్లు , పాత్రికేయుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన వెల్ నెస్ సెంటర్లలో మాత్రం ప్రస్తుతం వైద్యం పడకేసింది . వైద్యులు లేక , తమ అనారోగ్య సమస్య తట్టుకోలేక అక్కడికి వచ్చిన వారు వైద్యులు లేరని చెప్తున్న సమాధానంతో తెగ బాధ పడుతున్నారు.
మందుల కోసం పడిగాపులు .. అసహనంలో ఉద్యోగులు, పెన్షనర్లు , పాత్రికేయులు
ఇక అక్కడ మందుల కోసం పడిగాపులు పడుతున్నారు చాలా మంది సదరు హెల్త్ స్కీం ద్వారా వైద్య సేవలు పొందేవారు. ఇక గతంలో వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది వరుస క్రమంలో పెట్టి సామాజిక దూరం పాటిస్తూ నిలబడితే గతంలో వాడిన మందులే మరొక సారి ఇస్తున్నారు. అయితే చాలా మంది లాక్ డౌన్ ప్రభావంతో పెంచుకున్న మానసిక ఒత్తిడి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అంతే కాదు మందులు అయిపోయినా బయటకు వెళ్తే ఇబ్బంది అని భావించిన వాళ్ళు మందులు కూడా వేసుకోకుండా చాలా రోజులు గడిపేశారు .
ఓపీ క్లోజ్ ... ఓన్లీ పాత ప్రిస్క్రిప్షన్ మందులే
ఇక తీవ్ర అనారోగ్యంతో లాభం లేదని వెల్ నెస్ సెంటర్స్ బాట పట్టారు. తీరా అక్కడకు వస్తే వారికి వైద్యులు లేరు .. ఓపీ క్లోజ్ అన్న బోర్డు దర్శనం ఇచ్చింది. ఇక అక్కడ ఉన్న వైద్య సిబ్బంది బయటే నిలబెట్టి వారికి బయటకు మందులు తెచ్చి ఇచ్చి పంపిస్తున్నారు. పాత ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మందులు ఇస్తున్నారు. ఎండకు నిలబడలేక కొందరు ఇబ్బంది పడుతున్నారు. ఇక కొందరు చెట్ల నీడను ఆశ్రయించి నానా పాట్లు పడుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో , ఇంకా అనుకోని ఆరోగ్య సమస్యలు కొత్తగా వచ్చిన వారు ఎక్కడికి వెళ్ళాలో , చూసే వైద్యులు ఎవరో దిక్కుతోచని పరిస్థితి .
వెల్ నెస్ సెంటర్లలో వైద్యులు ఉండేలా చూడాలని విజ్ఞప్తి
ఒక్క కరోనా మాత్రమే అంతకంటే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారి విషయంలో వైద్యం నిర్లక్ష్యం లేకుండా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక వెల్ నెస్ సెంటర్లలో వైద్యులు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య సేవలు అందించేలా , అలాగే కరోనా కు మాత్రమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలకు ఓపీ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలా కాకుంటే కరోనా బాధితుల కంటే దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడే వారే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.