తెలంగాణలో ముందస్తు రాదు, వచ్చినా: ఈసీతో మాట్లాడాక మర్రి
హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు లేదా మరో ఈ ఏడాదిలో ఎన్నికలు వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం అన్నారు. తెలంగాణలో ముందస్తుకు కేంద్ర ఎన్నికల సంఘం సుముఖత వ్యక్తం చేయడం లేదని చెప్పారు.
ముందస్తు ఎన్నికల వెనక టీఆర్ఎస్ కుట్ర దాగి ఉందని విమర్శించారు. ఆయన ఈ రోజు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ను కలిసి ముందస్తు ఎన్నికల పైనా, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు.
నాలుగు రాష్ట్రాలతో పాటు డిసెంబర్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగబోవన్నారు. ఒకవేళ మొండిగా వ్యవహరించి అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలని అనుకుంటే తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల 20 లక్షల ఓట్ల తొలగింపులో మతలబు ఏమిటన్నారు.
వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచే సత్తా ఉంటే ప్రగతి నివేదన సభ ఎందుకని తెరాసను మరో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చడమే ప్రగతి అంటే ఎలా అన్నారు. ప్రగతి నివేదన సభతో స్పీడు పెంచడం కాదని, ఓటమిని అంగీకరించి, ముందుస్తు ఎన్నికలంటూ సభ నిర్వహిస్తున్నారన్నారు.
ఎంతోమంది ప్రాణత్యాగంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పారు. ఓయూ విద్యార్థులను రెచ్చగొట్టారని, ఆత్మహత్యలు చేసుకున్నవారికి న్యాయం చేయని దుస్థితిలో టీఆర్ఎస్ ఉందన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయని టీఆర్ఎస్ ఆశలు కల్పించిందని, చివరకు ఉద్యోగాలు లేవు, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు లేవని, దళితులకు మూడు ఎకరాల భూమి లేదన్నారు.