గమ్యం లేని ప్రయాణంలా మారిన ఆర్టీసి సమ్మె..! దారి చూపాల్సింది ఇక న్యాయస్థానమే..!!
హైదరాబాద్ : ఆర్టీసి కార్మికులు తలపెట్టిన సమ్మె గమ్యం లేని ప్రయాణంలా మారింది. కార్మికులు ఏ డిమాండ్ తోనైతే సమ్మెకు పిలుపునిచ్చారో ఆ ప్రధాన డిమాండ్ ను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడంతో కార్మికులు సమ్మె పట్ల పట్టు కోల్పోయరనే భావన ఉద్యోగుల్లో కలుగుతోంది. ఆ ఒక్క విలీనం డిమాండ్ కాకుండా మిగతా అన్ని డిమాండ్ల పట్ల తగ్గేది లేదని కార్మిక జేఏసీ నేతలు చెప్పుకొస్తున్నా అంత నమ్మకం కుదరడంలేదనే చర్చ జరుగుతోంది. దీంతో సమ్మె ఓ చుక్కాని లేని నావలా తయారయ్యిందని ఆర్టీసి ఉద్యోగులు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా కార్మికుల చేస్తున్న సమ్మె పట్ల తెలంగాణ ప్రభుత్వం మొండి వైఖరితో ఉండడంతో సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. దీంతో పాటు ఆర్టీసి సమ్మె అంశం పార్లమెంట్ లో ప్రస్దావనకు వస్తే ఎలా స్పందించాలో ఎంపీలకు సీఎం చంద్రశేఖర్ రావు దిశా నిర్దేశం చేయడం కొసమెరుపు.
పార్లమెంట్ లో సమ్మె ప్రస్ధావన వస్తే ధీటుగా బదులివ్వండి.. ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం..
తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం చంద్రశేఖర్ రావు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల సూచనలు సలహాలు ఇచ్చారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల్లో ఎవరైనా ఆర్టీసీ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తే, దానికి టీఆర్ఎస్ ఎంపీలు దీటుగా బదులివ్వాలని సూచించారు. మోటార్ వెహికల్ యాక్టు-2019 ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. అదే విధంగా కాంగ్రెస్, తెలంగాణ నేతలు ఆర్టీసీ సమ్మె విషయంలో సాధారణ ప్రయాణీకుల అంశాలను పరిగణలోకి తీసుకోకుండా, ప్రజలను ఇబ్బంది పెడుతున్న విధానాలను ప్రస్తావించాలని పేర్కొన్నారు. అనవసర వివాదాస్పద వ్యాఖ్యలేవరూ చోయొద్దని ఎంపీలకు సీఎం చంద్రశేఖర్ రావు దిశానిర్దేశం చేసారు.
ఉద్యమ కాలాన్ని మరిపించిన సమ్మె.. రికార్డు స్థాయిలో సమ్మెలో ఉన్న కార్మికులు..
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మరో కొత్త రికార్డును చేరుకుంది. నేటి శనివారంతో సమ్మె 43వ రోజుకు చేరుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె 42 రోజుల పాటు సాగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో చాలా రోజుల పాటు జరిగిన సమ్మెగా సకల జనుల సమ్మెకు గుర్తింపు ఉండగా, ఇప్పుడు ఆ రికార్డును ఆర్టీసీ సమ్మె బ్రేక్ చేసింది. ఈ రోజుతో 43వ రోజులోకి అడుగుపెట్టిన సమ్మె తెలంగాణ చరిత్రలో సుదీర్ఘకాలంపాటు జరిగిన సమ్మెగా చరిత్రకెక్కనుంది. ఐనప్పటికి సమ్మె పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడటం లేదనే చర్చ జరుగుతోంది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెను ఎన్ని రోజులైనా కొనసాగిస్తామని ఆర్టీసి ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.
రసాబసాగా బస్ రోకో.. నిర్బంధంలోకి ఆర్టీసీ జేఏసీ నేతలు..
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉధృతమౌతోంది. ఇదే పరంపరలో శనివారం బస్ రోకో కార్యక్రమానికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని, ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. మరోవైపు, జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఐతే పరిస్దితులు చేయి దాటే అవకాశం ఉండడంతో అశ్వథ్తామ రెడ్డిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు పోలీసులు.
బస్ రోకోకు అనుమతి లేదు.. అందుకే అరెస్టులు చేస్తున్నామన్న సీపీ అంజనీ కుమార్..
తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాడు ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బస్ రోకోకు అనుమతి లేదని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేసారు. ఈ సందర్భంగా నిబందనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ప్రతి బస్ డిపో, బస్ భవన్ వద్ద 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో కి తెచ్చారు. దీంతో బస్ డిపోల ముందు బస్ రోకో కార్యక్రమానికి వెళ్లిన ఆర్టీసి ఉద్యోగులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉండగా సమ్మె లో పాల్గొన్న ఉద్యోగులెవరూ ఉంటుందని స్పష్టం చేశారు.