కన్నారెడ్డి కుటుంబసభ్యులే అసభ్యంగా ప్రవర్తించారు, వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశారు: నీరజ
తమ పట్ల కన్నారెడ్డి కుటుంబసభ్యులే అసభ్యంగా ప్రవర్తించారని అంతేకాకుండా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారని వ్యవసాయశాఖ అధికారిణి నీరజ ఆరోపించారు.
వికారాబాద్: తమ పట్ల కన్నారెడ్డి కుటుంబసభ్యులే అసభ్యంగా ప్రవర్తించారని అంతేకాకుండా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారని వ్యవసాయశాఖ అధికారిణి నీరజ ఆరోపించారు.తనపై కన్నారెడ్డి కుటుంబం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారామె.
బీటెక్ విద్యార్ధి కన్నారెడ్డిని పోలీసులు చితకబాదిన కేసులో సస్పెండైన వ్యవసాయ అధికారిణి(ఏఓ) నీరజ సాక్షి మీడియాతో మాట్లాడారు.
వ్యవసాయాధికారిణి నీరజ రూ.20 వేలు లంచం ఇవ్వాలని అడిగినట్టు ఆరోపణలు వచ్చాయి. లంచం ఇచ్చేందుకు అతను నిరాకరించడంతో స్థానిక పోలీసులతో అతడిపై దాడి చేయించినట్టు వార్తలు వచ్చాయి.
పోలీసులు ఎలాంటి ఫిర్యాదు నమోదుచేసుకోకుండానే కన్నారెడ్డిపై అమానుషంగా వ్యవహరించారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు.అయితే ఈ కేసులో నీరజ, మోమిన్ పేట ఎస్ ఐ రాజులపై కేసు నమోదుచేశారు. ఏవో నీరజను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఎర్రవల్లికి చెందిన కన్నారెడ్డి ఎరువుల దుకాణం ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. అయితే వెంటిలేటర్ లేకపోవడంతోనే ఎరువుల దుకాణం ఏర్పాటుకు అనుమతించలేదని ఆమె చెప్పారు. వ్యవసాయకార్యాలయంలో తనతోపాటు మరో ఇద్దరు మహిళ అధికారులున్నారని చెప్పారు.
తమ పట్ల కన్నారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. తమ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారని అందుకే పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పారామె. రాత్రికి రాత్రే తనను ప్రభుత్వం సస్సెండ్ చేస్తోందని ఊహించలేదన్నారు. తనకు న్యాయం జరుగుతోందనే నమ్మకం ఉందన్నారామె.