బడ్జెట్లో ఒక్కపైసా ఇవ్వలేదు: కాంగ్రెస్, బీజేపీలను ఏకిపారేసిన కేటీఆర్, టీఆర్ఎస్లో చేరికలు
Recommended Video
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో మరోసారి తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వలేదని.. గత ఆరు బడ్జెట్లలోనూ తెలంగాణకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. శంషాబాద్ మున్సిపాలిటీలోని 8 మంది అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జీ గణేష్ గుప్తా, పలురువు నేతలు ఆదివారం కేటీఆర్ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
తెలంగాణకు మొండిచేయి.. ఒక్కపైసా ఇవ్వలేదు..
ఈ సందర్భంగా తెలంగాణభవన్లో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హక్కుగా వచ్చే వాటా తప్ప తెలంగాణకు కేంద్రం ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వడం లేదని అన్నారు. ఫార్మాసిటీ, కారిడార్లకు కేంద్రం మొండిచేయి చూపిందని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలకు పొద్దున లేస్తే టీఆర్ఎస్ సర్కారును, సీఎం కేసీఆర్ను విమర్శించడం తప్ప మరో పనిలేదని.. వారికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం చేతకాదని విమర్శించారు.
కేసీఆర్ శ్రీరామరక్ష..
తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని, ఇదే స్ఫూర్తితో అందరూ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కేటీఆర్ పార్టీలో చేరిన నేతలకు సూచించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించిందని తెలిపారు. రాష్ట్రంలో 132 పుర, నగరపాలిక ఎన్నికల్లో 3148 వార్డులు, డివిజన్లలో పోటీ చేసిన టీఆర్ఎస్ 1800 సీట్లను గెలిచిందని చెప్పారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు 1200 సీట్లలో అభ్యర్థులను కూడా నిలపలేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పొత్తు..
కేసీఆర్ను ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్ తమ సిద్ధాంతాలను వదిలి కుమ్మక్కయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. అయినా మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పొత్తు విషయంపై సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ అసహనం వ్యక్తం చేశారని కేటీఆర్ తెలిపారు.
అడ్డిమారిగుడ్డిదెబ్బల బీజేపీ..
కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని.. బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిదని అన్నారు. అడ్డిమారిగుడ్డిదెబ్బల పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో గెలిచిందన్నారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుందని అన్నారు. శంషాబాద్ వరకు మెట్రో రైలును పొడిగిస్తామని తెలిపారు. సహకార ఎన్నికల్లోనూ మున్సిపాలిటీ తరహాలోనే ఫలితాలు సాధిస్తామన్నారు.