చిన్నారుల టీకాల పై పర్యవేక్షణ కరువు..! రికార్డులకెక్కని లెక్కలు..!అదికారుల నిర్లక్ష్యం..!!
హైదరాబాద్: చిన్నారులకు వేసే వ్యాధి నిరోధక టీకాలపై పర్యవేక్షణ కొరవడింది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిలో నిర్లక్ష్యపు ధోరణి పరాకాష్ఠకు చేరింది. నాంపల్లిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. అక్కడి పీహెచ్సీలోని వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో క్షేత్ర స్థాయిలో ఏంజరుగుతుందని ఆరా తీసిన అదికారులకు చేదు వాస్తవాలు సాక్షాత్కరించాయి.
వేసవి వచ్చిందొచ్ .. ఒంటిపూట బడులు తెచ్చిందొచ్ ...
ఖరీదైన టీకా మందులు..! కళ్ల ముందు నుండి క్షణంలో మాయం..!!
కాగా ఈ చిన్నారులు మృతి ఘటనతో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రోజు 92 మందికి టీకాలు వేశామని వైద్య సిబ్బంది చెబుతుండగా, 30 మంది చిన్నారుల లెక్కే తేలింది. దీంతో నిజంగానే 92 మంది చిన్నారులకు టీకాలు వేశారా? లేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే పెంటలా వాలెంట్ టీకా ఖరీదు 2700 రూపాల దాకా ఉంటుంది. దీనిని కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఎంత మందికి ఎన్ని టీకాలు వేసారో నిర్దిష్టంగా రికార్డుల్లో పొందుపరచకపోవడం విచారకరం.
సాంకేతిక సిబ్బంది కొరత..! రికార్డుల్లో నమోదు కాని లెక్కలు..!!
ఇలాంటి టీకా మందులు ప్రైవేటులో దొరికే అవకాశాలు చాలా తక్కువ. కొన్నిచోట్ల ఈ టీకాలను వైద్య సిబ్బంది అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ టీకాలు వేశాక శిశువు మాతృ మూర్తికి సంబంధించిన గుర్తింపు కార్డు ఆధారంగా వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నాంపల్లిలో అటువంటిదేమీ జరగలేదు. లెక్కల్లో 92 మందికి వేసినట్లు చూపించి, 30-40 మందికే టీకాలిచ్చి.. మిగిలినవి బయటికి తరలించారా? అన్న కోణంలో విచారణ జరపాలని సీనియర్ వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో నిర్లక్ష్యం..! విచారం వ్యక్తం చేస్తున్న జనం..!!
తెలంగాణలో చాలాచోట్ల ఇదే తంతు కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇచ్చే ప్రతి మందుకు, టీకాకు లెక్క ఉండాల్సి ఉండగా.. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వద్ద అటువంటి యాజమాన్య వ్యవస్థే లేనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన రికార్డులనే సరిగా నిర్వహించడం లేదని తెలుస్తోంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్య ఆరోగ్య శాఖలో ఇంతటి నిర్లక్ష్యం ఏంటని ప్రజలు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.
డేటా ఎంట్రీ ఏదీ? సాంకేతిక సిబ్బంది ఎక్కడ..?
రాష్ట్రంలో అన్ని పీహెచ్సీలకు ప్రభుత్వం కంప్యూటర్లు ఇచ్చింది. ఏఎన్ఎంలకు ట్యాబ్లు ఇచ్చారు. కానీ, ఆన్లైన్ లో పొందుపరిచే సాంకేతిక సిబ్బందిని మాత్రం ఇవ్వలేదు. ఎంతమందికి మందులిస్తున్నారు? ఎన్ని మందులు పీహెచ్సీలో ఉన్నాయి? తదితర విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ కావడంలేదు. అయితే నాంపల్లి ఘటన తరువాత వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ చైర్మన్గా 10 మంది సభ్యులతో నిపుణుల కమిటీని వేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఈ నెల 18లోగా సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించడం కొసమెరుపు.