ఇబ్బంది పెట్టారు, బాబు అడ్డుకున్నా, కిరణ్కు కెసిఆర్ 24 గంటల్లోనే: జగదీశ్వర్
హైదరాబాద్: ఒకప్పుడు సమైక్య పాలకులు తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తికే అవకాశం లేకుండా చేశారని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి సోమవారం నాడు ఆరోపించారు. అసెంబ్లీలో విద్యుత్ అంశంపై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు విద్యుత్ రాకుండా అడ్డుకుంటే ఇక్కడి టీడీపీ నేతలు ఆయనకు వంతపాడారన్నారు. తెలంగాణ టీడీపీ నాయకులను చంద్రబాబు తమ ప్రభుత్వ పైకి ఉసిగొల్పారని విమర్శించారు.
ఇక్కడి బొగ్గు, నీళ్లను సమైక్య పాలనలో ఆంద్రాకు తరలించుకుపోయి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేశారన్నారు. గత పాలకులు తెలంగాణ ప్రజలు, రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. అసలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజునే విద్యుత్ కోతలు అని ప్రతిపక్షాలు విమర్శించాయన్నారు.
పురిట్లోనే తెలంగాణ రాష్ర్టానికి గండికొట్టాలని కుట్రలు పన్నారన్నారు. ఇవాళ కూడా తెలంగాణ అభివృద్ధిలో కలిసి రావడం లేదని, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రభుత్వం ఆగలేదన్నారు.
సమైక్య రాష్ట్రంలో పవర్పాయింట్ ప్రెజెంటేషన్లే కానీ తెలంగాణకు పవర్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే ఈ ప్రాంతం అంధకారంలోనే ఉంటుందని పవర్ పాయింట్ పెజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
కానీ కేసీఆర్ 24 గంటల్లోనే ఆయనకు ధీటైన సమాధానం చెప్పారన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం మన తెలంగాణకు రావాల్సిన 53 శాతం విద్యుత్ వాటాను ఏపీ సర్కారు ఇవ్వలేదని జగదీశ్వర్ రెడ్డిఅన్నారు. ఏపీ నుంచి మనకు 1559 మెగావాట్ల విద్యుత్ను రావాల్సి ఉందన్నారు.
కేంద్రం నుంచి 2038 మెగావాట్ల విద్యుత్ అందుతోందన్నారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడిన వెంటనే అనేక అడ్డంకులు సృష్టించారన్నారు. అయినా అన్ని అడ్డంకులను అదిగమించి సీఎం కేసీఆర్ విద్యుత్ కోతను ఎదుర్కొన్నారని, కరెంట్ కోతలు లేకుండా చేశారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులను ఆదుకోవడానికి అధికారులు విద్యుత్ ఎక్కడ దొరికితే అక్కడ కొని రైతులకు సరఫరా చేశారన్నారు. రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఎంత ఖర్చైనా సరే విద్యుత్ సమస్య లేకుండా చేశామన్నారు.
సీఎం కేసీఆర్ దూర దృష్టి, జెన్కో, ట్రాన్స్కో అధికారుల కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. రైతుల్లో ధైర్యం నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అరవై ఏళ్ల సమైక్య పాలనలో దగాపడ్డ రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ సమగ్రమైన ప్రణాళికలు రూపొందించారన్నారు.
విభజన తర్వాత ఏం జరిగిందో ప్రతిపక్ష సభ్యులకు తెలుసన్నారు. ఇవాళ సభలో ఉంటే వాళ్ల అరవై ఏళ్ల భాగోతం బయటపడుతుందనే సభ నుంచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. నిజానిజాలు వినడానికి ప్రతిపక్షాలకు ఇష్టం లేదన్నారు.
చంద్రబాబు అడ్డుకున్నా: సోమారపు
తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన విద్యుత్ను చంద్రబాబు అడ్డుకున్నా ఆ సమస్యను అధిగమించామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలకే విద్యుత్ సమస్యను అధిగమించామని చెప్పారు.