ఆ అవసరమే లేదు, మీదే బ్లైండ్ గేమ్, మీ వాళ్లు టచ్ లోనే ఉన్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ నేతల వలసలను ‘దిక్కుమాలిన మైండ్ గేమ్’గా అభివర్ణించిన మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి స్పందించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ కు మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదని, టీఆర్ఎస్ పార్టీయే బ్లైండ్ గేమ్ ఆడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ నేతల వలసలను 'దిక్కుమాలిన మైండ్ గేమ్'గా అభివర్ణించిన మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై ఉత్తమ్ స్పందించారు.
టీఆర్ఎస్ నాయకత్వంపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమన్నారు. వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, తమతో టచ్లోనే ఉన్నారని కూడా ఉత్తమ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, వారంతా సరైన సమయంలో తమ పార్టీలో చేరబోతున్నట్లు చెప్పారు.
టీఆర్ఎస్ ది ఫౌల్ గేమ్: మల్లు భట్టి విక్రమార్క
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఫౌల్ గేమ్ను మొదలు పెట్టింది టీఆర్ఎస్ పార్టీయే అన్నారు.
‘‘ఆట మీరు మొదలు పెట్టారు. మేం ముగిస్తాం'' అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో రిటైర్మెంట్లు ఉంటాయో, రిక్రూట్మెంట్లు ఉంటాయో త్వరలోనే చూస్తారన్నారు. టీఆర్ఎస్ నేతలు పార్టీలోని నియంతృత్వ పోకడలపై ఆవేదన చెందుతున్నారని, పంజరంలో చిక్కిన చిలుకల్లా విలవిల్లాడుతున్నారన్నారు. రియల్ గేమ్ త్వరలోనే షురూ అవుతుందని భట్టి వ్యాఖ్యానించారు.
ఆ పేటెంట్ టీఆర్ఎస్ పార్టీదే: మల్లు రవి
మైండ్ గేమ్ ఆడే పేటెంట్ టీఆర్ఎస్ పార్టీకే ఉందని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ చేయించిన సర్వేలు బూమరాంగ్ అయ్యాయని, అవి తిరిగి ఆయనకే చుట్టుకున్నాయన్నారు.
సెంట్రల్ పెన్షన్ విధానంతో ఉద్యోగులకు ఇబ్బంది...
మరోవైపు సెంట్రల్ పెన్షన్ విధానంపై ఉద్యోగులకు ఇచ్చిన హామీని టీఆర్ఎస్ నిలబెట్టుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎస్ పై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం తెలంగాణ రాష్ట్ర నేతలు గురువారం ఉత్తమ్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారంనాటి ఉద్యోగుల ధర్నాలో తమపార్టీ ప్రతినిధి కూడా పాల్గొంటారన్నారు.
నారాయణపూర్ డ్యామ్ నుంచి నీటి విడుదల కోసం...
కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి పాత పాలమూరు జిల్లాకు 15 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో ఓ బృందం త్వరలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వద్దకు వెళ్లనుంది.