అక్కడ అసెంబ్లీ వద్దు: కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎర్రమంజిల్లోని పురాతన భవనాలను కూల్చి నూతన అసెంబ్లీని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఎర్రమంజిల్లోని చారిత్రక భవనాలను కూల్చి నూతన అసెంబ్లీని నిర్మాణానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భూమి పూజ కూడా చేసింది.
అంతేగాక, మంత్రివర్గం కూడా ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ క్రమంలో ఎర్రమంజిల్లోని చారత్రక భవనాలను కూల్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటినీ కలిపి విచారించిన హైకోర్టు.. సోమవారం తన తీర్పును వెలువరించింది.
చారిత్రక భవనాలను కూల్చివేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి బ్రేకులు పడినట్లయింది. కాగా, జులై 3 నుంచి హైకోర్టులో పలు దఫాలుగా ఈ విషయంపై వాదనలు సాగుతున్నాయి. చారిత్రక భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించడంపై పిటిషనర్ల తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కొత్త భవనాలు నిర్మించడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందన్నారు. అంతేగాక, పురాతన కట్టడాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించినట్లవుతుందని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం తాజా ఆదేశాలను జారీ చేసింది.