ఉమాభారతి చెప్పారు, కేంద్రం యూ టర్న్: 'కృష్ణా జలాల'పై వినోద్ ఫైర్
హైదరాబాద్/న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంపిణీ నాలుగు రాష్ట్రాలకు అవసరం లేదని, రెండు రాష్ట్రాలకు చాలని చెప్పిన కేంద్రం వైఖరి పైన టిఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మంగళవారం మండిపడ్డారు. నాలుగు రాష్ట్రాలకు సమానంగా పంచుతామని, ఇందుకోసం కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని ఉమాభారతి చెప్పారన్నారు.
కేంద్రమంత్రి ఉమాభారతి ఈ విషయమై హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు కేంద్రం ట్రైబ్యునల్ పైన యూ టర్న్ తీసుకుందన్నారు. నేను, నిజామాబాద్ ఎంపీ కవిత కేంద్రమంత్రి ఉమాభారతిని కలిశామని, అప్పుడు కొత్త ట్రైబ్యునల్ పైన హామీ ఇచ్చారన్నారు.
కృష్ణా జలాల్లో తమ వాటా దక్కించుకునేందుకు పోరాటం చేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి తీసుకు వెళ్తామని, ఏం చేయాలో నిర్ణయిస్తామని అభిప్రాయపడ్డారు.
బుధవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ... కృష్ణా జలాల పంపిణీ పైన తెలంగాణ బిజెపి నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జలాల కోసం తాము రాజకీయ, న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో వాటా అవసరమని చెప్పారు. నాలుగు రాష్ట్రాలకు సమాన వాటా దక్కేలా చూడాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టు అనుమతులను కేంద్రం తుంగలో తొక్కుతోందని ఆరోపించారు.
కాగా, కృష్ణా జలాల విభజనను రెండు రాష్ట్రాలకే (తెలంగాణ, ఏపీ) పరిమితం చేయాలని కేంద్రం సుప్రీం కోర్టులో చెప్పింది. మహారాష్ట్ర, క్నాటక వాటలలోకి వెళ్లవద్దని చెప్పింది. కాగా, కేంద్రం వైఖరి పైన స్పందించేందుకు తెలంగాణ గడువు కోరింది. దీంతో విచారణ గురువారానికి వాయిదా పడింది.