కేసీఆర్, కేటీఆర్ వస్తే బట్టలూడదీసి పంపండి, కొండను తవ్వి ఎలుకని పట్టారు: ఐటీ దాడులపై రేవంత్
కామారెడ్డి: ఏసీపీ దాడులతో తననేమీ చేయలేరని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆదివారం అన్నారు. తెలంగాణలో అడ్డగోలు ఇసుకమాఫియా తయారయిందని వ్యాఖ్యానించారు. అడ్డు వచ్చిన అమాయకులను లారల కింద పడేసి చంపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
Recommended Video
రేవంత్పై ప్రశ్నల వర్షం, భార్యను బ్యాంక్కు తీసుకెళ్లిన అధికారులు: హాంకాంగ్లో ఖాతా, ఎవరీ మురళి?
రేవంత్ కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ నుంచి రోడ్డు షో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణలో ఉద్యోగాలు రాలేదని, రిజర్వేషన్లు లేవని విమర్శించారు. గంపా గోవర్దన్ ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన మాట్లాడారా అని నిలదీశారు. కేసీఆర్ను, గంపా గోవర్ధన్ను వంద మీటర్ల గోతి తీసి పాతరేయాలని దుయ్యబట్టారు.
కేసీఆర్, కేటీఆర్ బిక్కనూరు వస్తే బట్టలూడదీసి పంపండి
కామారెడ్డి నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చిందే షబ్బీర్ అలీయేనని రేవంత్ రెడ్డి అన్నారు. షబ్బీర్ అలీని గెలిపించుకుంటే ఉప ముఖ్యమంత్రిగా చూసే అవకాశం కూడా ఉంటుందని అన్నారు. కేసీఆర్ లేదా కేటీఆర్ బిక్కనూర్ వస్తే బట్టలు ఊడదీసి పంపండని ప్రజలకు సూచించారు. ఇసుక మాఫియా లారీల కింద పడి దళితులు మరణిస్తుంటే.. వారి శవాలపై వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా
తన ఇంట్లో చేపట్టిన ఆదాయపు పన్ను శాఖ దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉన్నాయని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే తనపై ఐటీ దాడులు అన్నారు. కేసీఆర్ని ఓడించేందుకు ఊరూరా ప్రచారం చేస్తానని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించి, దోపిడీ పాలనకు అంతం పలకాలన్నారు. కొండగట్టులో 60 మందికి పైగా చనిపోతే కేసీఆర్ కనీసం వారిని పరామర్శించకపోవడం ఆయన నైజాన్ని బయట పెట్టిందని మండిపడ్డారు.
ఎవరికి ఓటు వేస్తారు?
కాంగ్రెస్ పార్టీలో రెండో స్థానంలో ఉన్న షబ్బీర్ అలీకి ఓటు వేస్తారా లేక గంపకు ఓటు వేస్తారా చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు. కొండగట్టు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదని షబ్బీర్ అలి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు బెల్లంకు అనుమతి ఇస్తామని చెప్పారు.
కేసీఆర్ ఎంగిలి మెతుకులు తిని, కేటీఆర్ బూట్లు నాకే సుమన్
రేవంత్ రెడ్డిపై తెరాస నేత బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీపీసీసీ నేతలు మేడిపల్లి సత్యం, వెంకటేష్ తదిరులు ఆదివారం అన్నారు. సుమన్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ ఎంగిలి మెతుకులు తిని, కేటీఆర్ బూట్లు నాకే సుమన్ను బట్టలూడదీసి కొడతామన్నారు. దళితులపై దాడులు జరిగితే ఒక్కసారి సుమన్ నోరు మెదపలేదన్నారు.