ఎవరికీ అందని తెలంగాణ ఓటరు నాడి..! ఏమౌతుందో..! అంతా ఉత్కంఠే..!!
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ ఓటరు ఎందుకో గభీరంగా కనిపించాడు. తెలంగాణ ముందస్తు ఎన్నికలో ఓటేసిన ప్రజలు అందుకు సంబందించిన భావోద్వేగాన్ని మాత్రం ఎక్కడా బహిర్గతం కాకుండా అణిచి పెట్టుకున్నాడు. అవేశం, ఆలోచన కలగలిసిన తెలంగాణ ఓటరు ఈ సారి ఎన్నికల్లో చాలా గుంభనంగా వ్యవహరించారు. ఓటరు నాడి అంతు చిక్కక ఫలితాలను అంచనా వేయడానికి సర్వే సంస్దలు మూడు చెరువుల నీళ్లు తాగాయి. లగడపాటి రాజగోపాల్ చెప్పింది మాత్రం ఒకటి నిజం. ఈ సారి పార్టీల ప్రచార హోరు... లెక్కకు మిక్కిలిగా ఎర చూపిన తాయిలాలతో తెలంగాణ ఓటరును తీవ్రమైన ఒత్తిడిలో పడేసి గందరగోళానికి గురి చేశాయి. అందుకే ఓటరు తన అభిప్రాయాలను ఎవరితో మనస్పూర్తిగా పంచుకోకుండా ముభావంగా వ్యవహరించారు.
భిన్నమైన సర్వే ఫలితాలతో గందరగోళం..! ప్రజా తీర్పు ఎవరికి అనుకూలమో చెప్పడం కష్టం..!!
దీంతో ఫలితాలపై ముందస్తు సర్వేలు చేసిన సంస్ధలన్నీ.... ఫార్ములాలను ఫాలో అయి ఒక కంక్లూజన్ కి వచ్చాయి తప్పితే ఇదమిద్దంగా ఫలితాలను అంచనా వేయలేకపోయాయి. అందుకునే అటు జాతీయ మీడియా సంస్ధలు చేసిన సర్వేలు కానీ, ఇటు రాష్ట్ర స్ధాయిలో పలు ప్రొఫెషనల్ సర్వే సంస్ధలు వేసిన అంచనాలు కానీ ఏ రెండిటికీ పొంతన లేకుండా ఉన్నాయి. ఎవరి సర్వే నమ్మాలో ఎవరి సర్వే నమ్మకూడదో అర్ధం కాని పరిస్ధితుల్లో పడ్డారు ప్రజలు.
ఒక్క లగడపాటి మినహా అందరూ టీఆర్ఎస్ జైకొట్టారు..! మరి ఆక్టోపస్ సర్వే పరిస్థితి ఏంటి..?
ఒకసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పలు సంస్ధలు ఇచ్చిన ఎక్జిట్ పోల్ సర్వేలను పరిశీలిస్తే అధికార టీఆర్ఎస్ ఓడి పోతుందని చెప్పిన ఒకే ఒక్కడు లగడపాటి రాజగోపాల్. ఈయన తన ఆర్జీ ఫ్లాష్ టీమ్ తో చేయించిన సర్వేలో టీఆర్ఎస్ పది తక్కువా ఎక్కువల్లో 35 స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్ పదితక్కువా ఎక్కువల్లో 65 అసెంబ్లీ స్ధానాలు గెలుచుకుంటుందని ప్రకటించారు.
అంతుచిక్కని ఓటరు నాడి..! అంచనాలు తప్పైయ్యే అవకాశాలు..!!
ఇతరులు అంటే భారతీయ జనతా పార్టీ, స్వతంత్రులు కలిపి నాలుగు ఎక్కువా తక్కువల్లో 14 స్ధానాల్లో విజయం సాధిస్తారని పేర్కొన్నారు. అంటే దాదాపు ముప్పై శాతం ఛాయిస్ తీసుకుని ఏకంగా పది అటూ ఇటూలో అని చెప్పడం గమనార్హం. ఇక ఇండియాటుడే అయితే టీఆర్ఎస్ ఏకంగా 79 నుంచి 91 స్ధానాలు కైవశం చేసుకుంటుందని చెప్పింది. ఈ సర్వేలో మహాకూటమికి 21 నుంచి 33, ఇతరులు 5నుంచి 10 స్ధానాల్లో గెలుపొందుతారని తెలిపింది. ఇక మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ సర్వే సంస్ధ ఆరా కూడా టీఆర్ఎస్ కు 75 నుంచి 85 స్ధానాలు ఇచ్చింది. కూటమికి 25 నుంచి 35, ఇతరులు 9 నుంచి 11 స్థానాల్లో గెలుస్తారని చెప్పింది.
జాతీయ మీడియా అంతా ఒకటే తేల్చింది..! మరి బ్యాలెట్ ఏం తేల్చ బోతోంది..?
రిపబ్లిక్ టీవీ-సీఓటర్ సర్వేలో టీఆర్ఎస్ 48 నుంచి 60, కేటమి 47 నుంచి 59, ఇతరులు 6 నుంచి 13 అసెంబ్లీ సీట్లు సాధిస్తారని చెప్పారు. రిపబ్లికన్ టీవీ జన్ కీ బాత్ సర్వేలో టీఆర్ఎస్ కు 50 నుంచి 65, కూటమికి 38 నుంచి 52, ఇతరులు 12 నుంచి 21 స్థానాలు దక్కుతాయన్నారు. టౌమ్స్ నౌ, న్యూస్ ఎక్స్ బృందం చేసిన సర్వేల్లో మాత్రం ఖరాఖండిగా సీట్లను ప్రకటించారు, న్యూస్ ఎక్స్ ఐటీవీ, నేత సంయుక్త సర్వేలో టీఆర్ఎస్ 57 కూటమి 46 ఇతరులు 16 స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది. ఇక టైమ్స్ నౌ టీఆర్ఎస్ 66, ప్రజాఫ్రంట్ 37, ఇతరులు 16 అసెంబ్లీ స్ధానాలను కైవశం చేసుకుంటారని లెక్క తేల్చింది. అయితే వీరిలో ఓటరు నాడిని ఎవరు సరిగా పసిగట్టగలిగారు, ఎవరి సర్వేలు నిజమవుతాయో తెలియాలంటే ఈ నెల 11వ తేదీ వరకూ వేచి చూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.