రేసులా దూసుకెళ్తే.. కేసులతో మూసేస్తారు..! యూత్ వేగానికి బ్రేకులు వేయనున్న పోలీసులు..!!
telangana,police,traffic rules,over speed,penalties,violation of rules,signal jump,fine,youth,city.తెలంగాణ, పోలీసులు,ట్రాఫిక్ నియమాలు, మితిమీరిన వేగం, జరిమానాలు, అతిక్రమణ, సిగ్నల్ జంప్, యూత్, హైదరాబా
హైదరాబాద్: "మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూపానులా రెచ్చిపొమ్మన్నది" అనుకుంటూ రయ్యిమని దూసుకెళ్దామనుకుంటున్నారా..? ఇక మీ ఆటలు సాగవు. సరదా రైడ్ కోసం వాహనం తీసి షికారుకెళ్లే క్రమంలో నియమాలను అతిక్రమించి వాహనం నడిపితే మీరు సక్రమంగా, సకాలంలో ఇంటికి చేరడం కష్టమే.. నియమాలను అతిక్రమించి అతివేగంతో వాహనం నడిపితే మీరు జైలుకు, మీ వాహనం పోలీసు స్టేషన్ కి వెళ్లడం ఖాయం. అంతే కాకుండా రోజులో ఎన్నిసార్లు నియామాలను ఉల్లంఘిస్తే అన్నిసార్లూ ఫైన్ కట్టాల్సిందే.. అందుకే వాహన దారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.ః
దూసుకెళ్తే కేసులే..! మితిమీరిన వేగానికి కళ్లెం వేసే వ్యూహం..!!
పరిమితులను పట్టించుకోకుండా వాహనాల్లో రయ్యిమంటూ దూసుకువెళ్లే వారికిక గడ్డుకాలమే. ఇలాంటివారు ఒకేరోజు నాలుగైదుసార్లు నిబంధనలను ఉల్లంఘిస్తే.. అన్నిసార్లూ జరిమానా చెల్లించుకోక తప్పదు. ఈ మేరకు నిబంధనలను కఠినతరం చేస్తూ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ ఒకరోజు ట్రాఫిక్ ఉల్లంఘనకు ఒకే చలానా వచ్చేది. అదే రోజు మరో ఉల్లంఘన జరిగినా చలానా పంపేవారు కాదు. తాజాగా రాజధానిలో మితిమీరిన వేగంతో వెళ్తున్న వారిని లేజర్ గన్లతో గుర్తించి వారు ఎన్ని ప్రాంతాల్లో వేగంగా వెళ్లారో.. అన్ని చోట్లనుంచీ ఈ-చలానాలు పంపుతున్నారు. ద్విచక్రవాహనాలు మొదలుకొని అన్ని వాహనాలకూ ఇది వర్తిస్తుంది.
రోజుకు ఒక్క జరిమానాతో సరిపెట్టే పద్ధతి లేదు..! ఎక్కడ గీత దాటితే అక్కడ మళ్లీ వడ్డన..!!
ఉదాహరణకు పంజాగుట్టలో ఉదయం వేగంగా వెళ్తున్న ఒక కారుపై జరిమానా విధించారనుకుందాం. అదేకారు ఆ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ను మితిమీరిన వేగంతో దాటేస్తే రెండో జరిమానా, సాయంత్రం మరో రోడ్డుపై దూసుకెళ్తే మూడో జరిమానా.. ఇలా వరుసగా విధించనున్నారు. కొన్ని నెలలుగా హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించిన పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శిరస్త్రాణాల విషయంలో మాత్రం వరుస చలానాల నుంచి మినహాయింపునిచ్చారు. శిరస్త్రాణం ధరించకుండా ద్విచక్రవాహనంపై వెళ్తున్న వాహనచోదకుడిపై ఒక్కసారి చలానా విధిస్తే... ఆరోజంతా రెండో కేసు నమోదు చేయబోరు.
వేగ పరిమితులివీ..! అందరూ పాటించాల్సిందే..!!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫలానా ప్రాంతంలో ఇంతే వేగంగా వెళ్లాలని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు ప్రమాణాలను పాటిస్తున్నారు. వీటి ఆధారంగా ఆయా ప్రాంతాల్లో అధికారులు ఖరారు చేసిన వేగపరిమితినే పాటించాలి. ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో అప్పర్ ట్యాంక్బండ్పై గంటకు 30 కి.మీ. వేగంతో వెళ్లాలంటూ లోకాయుక్త ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్డు రహదారిపై గంటకు 100 కి.మీ. వేగంతోనే వెళ్లాలి. అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్తే జరిమానాలు విధిస్తున్నారు. నాలుగు వరుసల రహదారి ఉన్న ప్రాంతాల్లో వేగపరిమితులు గంటకు 40 కి.మీ. - 60 కి.మీ. మధ్య ఉన్నాయి.
ఒక్కో చలానా 1,400 రూపాయలు..! కట్టకపోతే జైలే..!!
మోటార్ వాహన చట్టం ప్రకారం ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు ఒక్కో కేసుకు 1,400 రూపాయల జరిమానా విధిస్తున్నారు. ఈ లెక్కన హైదరాబాద్లోని ఐదుచోట్ల ట్రాఫిక్ పోలీసుల లేజర్గన్కు చిక్కితే.. ఆరోజు 7 వేల రూపాయల జరిమానా తప్పనట్లే. జరిమానాలు చెల్లించని పక్షంలో వాహనాలు స్వాధీనం చేసుకోనున్నారు. అంతే కాకుండా నాన్ మెయిలబుల్ కేసులు కూడా పెట్టాలని పోలీసులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.