మేడారం జాతరలో ఆ వస్తువులు నిషేధం: భక్తులు సహకరించాలంటున్న అధికారులు
Recommended Video
ములుగు: మరో రెండు రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. భక్తులు కూడా సమ్మక సారలమ్మలను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కావడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. రానున్న 10 రోజుల్లో దాదాపు కోటి మంది ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 6వ తేదీ 7వ తేదీల్లో సమ్మక్మ సారలమ్మలను ఊరేగింపుగా తీసుకురానున్న నేపథ్యంలో ఆరోజు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సారి మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మేడారం జాతరకు నో ప్లాస్టిక్
ఏటూరు నాగారం అటవీ ప్రాంతం నుంచి ముందుగా మేడారం జాతరకు ముఖద్వారంగా ఉండే గట్టమ్మ ఆలయం దగ్గరకు శుక్రవారం నాటికే లక్షలమంది భక్తులు చేరకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ములుగు జిల్లా పాలనా యంత్రాంగం వాలంటీర్లను మోహరించింది. వీరంతా భక్తులు తమ వెంట తీసుకొచ్చే ప్లాస్టిక్ వస్తువులను సేకరిస్తున్నారు. భక్తుల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వస్తువులతో ఓ భారీ ప్లాస్టిక్ స్టాచ్యూను తయారు చేసి ప్రవేశ ద్వారం ముందుంచారు. ప్లాస్టిక్పై యుద్ధం చేద్దామనే స్లోగన్లు కనిపించాయి. ఇలా చేయడం ద్వారా భక్తులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల తలెత్తే ప్రమాదాలపై అవగాహన వస్తుందని అధికారులు చెబుతున్నారు.
బట్టతో చేసిన బ్యాగులను పంచుతున్న అధికారులు
ఇక మేడారం జాతరకు వెళ్లే అన్ని రహదారులపై అక్కడక్కడ చెక్పోస్టులను పెట్టారు. భక్తులు తమతో తీసుకొచ్చే ప్లాస్టిక్ వస్తువులను అక్కడే కలెక్ట్ చేసుకుంటున్నారు. భక్తులకు బట్టతో తయారు చేసిన బ్యాగులను ఇస్తున్నారు. ఇక బట్టతో కూడిన బ్యాగులను భక్తులకు ఇచ్చేందుకు గాను స్థానిక గ్రామస్తులు తమ పాత బట్టలను టైలర్లకు ఇవ్వాలని వారు బ్యాగులుగా తయారు చేసి ఇస్తారని చెప్పినట్లు సమాచారం. ఇక భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో వారి భధ్రతను చూడటంతో పాటు ఈ పండగను ప్లాస్టిక్ రహిత పండగగా చేయాలనుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.
ఐటీసీతో జతకట్టిన ములుగు పాలనా యంత్రాంగం
జాతరకు ప్లాస్టిక్ వస్తువులను అనుమతించేది లేదని ఇప్పటికే చాటింపు వేయించినట్లు అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ వేస్ట్ను సేకరించేందుకు ఐటీసీతో కలిసి పనిచేస్తున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. ఇక ప్లాస్టిక్ వస్తువులను సేకరించేందుకు 1000 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని అదే సమయంలో సేకరించిన ప్లాస్టిక్ వస్తువులను తరలించేందుకు 150 వాహనాలను అద్దెకు తీసుకున్నట్లు చెప్పారు జిల్లా కలెక్టర్. ఇందులో ట్రాక్టర్లు, ఆటోలు ఉన్నట్లు వెల్లడించారు. ఏటూరు నాగారం అటవీప్రాంతంలో ఉన్న జలపాతాలు లంకవర, రామప్ప బొగతా, చింతమామ్ల దగ్గర కూడా ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలను ఉంచినట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు.