కేటీఆర్.. నన్ను మర్చిపోయినా పర్వాలేదు.. కనీసం వాళ్లనైనా గుర్తుంచుకో: రేవంత్ ఎద్దేవా
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్ నగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
''రేవంత్ రెడ్డి ఎవరంటూ కేటీఆర్ అడుగుతున్నారు.. నేను గుర్తు లేకపోయినా పర్వాలేదు.. కనీసం శ్రీకాంతాచారి, కోదండరాం వంటి వాళ్లనైనా గుర్తుంచుకో..'' అంటూ ఎద్దేవా చేశారు.
మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్లో లైవ్ చాట్ ద్వారా నెటిజన్లతో సంభాషించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయాలు, వ్యక్తిగత అభిరుచులు గురించే కాక సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల గురించి కూడా తన అభిప్రాయాలు వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా ఓ నెటిజన్ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గురించి రెండు ముక్కల్లో చెప్పమని కోరగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. 'హూ ఈజ్ దట్' అంటూ రిప్లై ఇచ్చారు.
ఈ విషయం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా.. ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. ఇక మంత్రి లక్ష్మారెడ్డి వైద్య విద్యను ఎక్కడ అభ్యసించారో చెప్పాలంటూ.. 'జడ్చర్లకు రా.. ఇద్దరి సత్తా ఏమిటో తేల్చుకుందాం..'' అని రేవంత్ సవాల్ విసిరారు.
''కొత్త బిచ్చగాళ్లు ఇప్పుడు కాల్వల వెంట తిరుగుతున్నారు..''
అంతకుముందు జిల్లాలోని మిడ్జిల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మూలాఖత్ సభకు రేవంత్ రెడ్డి, మల్లు రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులలో 90 శాతం పనులు కాంగ్రెస్ హయాంలో పూర్తి చేశారన్నారు.
ఇప్పుడు కొత్త బిచ్చగాళ్లు కాల్వల వెంట తిరుగుతున్నారంటూ అధికారి టీఆర్ఎస్ పార్టీ నేతలను రేవంత్రెడ్డి ఘాటుగా విమర్శించారు. జడ్చర్లలో తానెవరినీ తక్కువ చేసి మాట్లాడలేదన్నారు. ఉస్మానియాలో శవాలను పట్టించుకోని వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్లకు ఏం చేస్తారని మాత్రమే ప్రశ్నించానని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.