బాబుతో ముప్పులేదు, కాంగ్రెస్ను గెలిపించేందుకే ఏపీ సీఎం: రేవంత్, ఆ ఆందోళనలో కేసీఆర్: కోదండ
హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాజకీయ చావు భయం పట్టుకుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆదివారం విమర్శించారు. విభజన నేపథ్యంలో అమరావతికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ముప్పులేదని చెప్పారు.
Recommended Video
చదవండి: 'కేసీఆర్ గురించి విజయశాంతికి ఆ రోజు గుర్తురాలేదా, ఈ విషయంపై స్టాండ్ ఏమిటి'
తెలంగాణలో నాలుగున్నరేళ్లు పాలించిన కేసీఆర్, తెరాస ప్రభుత్వం నష్టం చేసిందని అభిప్రాయపడ్డారు. అందుకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణలోని ప్రతి ఇంటికి ఒక్కరిని అరవై రోజుల పాటు మాకు ఇవ్వాలని ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
60 రోజులు మాకివ్వండి, 60 నెలలు మీకోసం పని చేస్తాం
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమికి 60 రోజులు మీరు సమయం ఇస్తే, ఆ తర్వాత 60 నెలలు మీకోసం పని చేస్తామని రేవంత్ రెడ్డి నినాదం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కేవలం 63 సీట్లలో మాత్రమే గెలిచిందని గుర్తు చేశారు. కానీ ఎమ్మెల్యేలను కొని ఆ సంఖ్యను కేసీఆర్ 100కు పెంచుకున్నారని మండిపడ్డారు.
అదే 100 మందిని ఎందుకు గెలిపించాలి?
ఇప్పుడు అదే వందమందిని మనం ఎందుకు గెలిపించాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్కు ఈసారి ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. అందుకే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ జీతగాడు కేసీఆర్ అన్నారు. రాబోయే కాలంలో మోడీ జీతగాడు మనకు సీఎంగా ఉండాలా అన్నారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, పోలీసులు ఇక స్వేచ్ఛగా పని చేసుకోవచ్చునని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. తెరాసకు కరెంట్ షాక్ తప్పదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఆయన కుటుంబం బాగుపడిందని, కనీసం అమరుల కుటుంబాలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన అంతం కావాలనే చంద్రబాబు మద్దతిచ్చారని చెప్పారు.
కేసీఆర్ మోసం చేశారు
కేసీఆర్ మైనార్టీలను మోసం చేశారని చేశారని కుత్బుల్లాపూర్ మైనార్టీ సభలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మైనార్టీలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ ఏజెంట్ అన్నారు.
అధికారం పోతే ఏమవుతుందనే ఆందోళనలో కేసీఆర్
అధికారం పోతే తన గతి ఏమవుతుందనే ఆందోళన కేసీఆర్లో కనిపిస్తోందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు కోదండరాం వేరుగా విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తన స్థాయి దిగజార్చుకుని మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణను నిరంకుశంగా పాలించాలని కేసీఆర్ అనుకుంటున్నారని, అధికారం ఆయనకు వ్యసనంలా మారిందని, అందుకే ఇతర పార్టీ నేతలపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేందుకే కూటమి కడుతున్నామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు అందరూ కలిసి పోరాడతామన్నారు.
ప్రజల ఆకాంక్ష కోసం కూటమి
రాబోయే రోజులు మావేనని కోదండరాం ప్రకటించారు. ఇది అహంభావంతో చెప్పడం లేదని, ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి చెబుతున్నామని, వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుంటున్నామని, ఇప్పటికే ఆయా పార్టీలతో సమాచారాన్ని పంచుకున్నామని అన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించుకుని సీట్ల సర్దుబాటుపై త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఆ తర్వాత ప్రచారాన్ని వేగవంతం చేస్తామని, కూటమిలో వ్యక్తి ప్రయోజనాల కంటే ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట వేస్తామని, ఇతర పక్షాలు కూడా ఇందుకు సహకరిస్తాయని భావిస్తున్నామని, మార్పు కోసం జరుగుతున్న ఈ ప్రయత్నానికి ప్రజలందరూ సహకరించాలన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఏ పార్టీతోనైనా కూటమి ఉంటుందన్నారు.