విజయశాంతిని అడవుల పాల్జేశారు, బస్సు యాత్ర తుస్సుమంది: కెసిఆర్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు తమకు పట్టం కట్టారని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు. తమ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం అంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుండి స్పందన లేకపోవడంతో అసెంబ్లీలో గందరగోళం సృష్టించారని కెసిఆర్ చెప్పారు. మూకుమ్మడి రాజీనామాలకు అధిష్టానం అనుమతి అవసరమా, రాజీనామాలు చేయొచ్చు కదా అంటూ కెసిఆర్ ఎద్దేవా చేశారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కెసిఆర్ బుధవారం నాడు అసెంబ్లీలో సుధీర్ఘంగా ప్రసంగించారు. విపక్షాలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఎండగట్టారు.
Recommended Video
ఏ ఏ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తెలంగాణకు అన్యాయం చేసిందనే విషయాన్ని కెసిఆర్ అసెంబ్లీలో ప్రస్తావించారు. తెలంగాణకు అన్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ మొదటి విలన్గా నిలిచిందన్నారు.
కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమంది
కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర తుస్సుమందని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తోంటే పట్టించుకోకుండా తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ బస్సు యాత్ర అంటూ తిరిగిన కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రజల నుండి స్పందన లేకుండా పోయిందని చెప్పారు. ఈ విషయమై తనకు నివేదికలున్నాయని చెప్పారు. దీనికి తోడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుండి జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడ టిఆర్ఎస్ను ప్రజలు ఆదరించారని కెసిఆర్ చెప్పారు. దీంతో అసహనానికి గురైన కాంగ్రెస్ పార్టీ నేతలు అసెంబ్లీలో గందరగోళం సృష్టించారని కెసిఆర్ విమర్శించారు.
విజయశాంతిని అడవుల పాల్జేశారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టిఆర్ఎస్ ఉంటుందా అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు అవహేళన చేశారని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు. తెలంగాణకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఇంకా ఘోరంగా మాట్లాడారని కెసిఆర్ గుర్తు చేసుకొన్నారు. ఆనాడు తమ పార్టీకి చెందిన ఎంపీ విజయశాంతిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొన్నారని కెసిఆర్ చెప్పారు. ప్రస్తుతం విజయశాంతి ఎక్కడుందన్నారు. విజయశాంతిని అడవులకు పంపారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తెలంగాణలో అప్పులు రూ,.1.42 లక్షల కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం నుండి వారసత్వంగా వచ్చిన వాటితో కలుపుకొని ప్రస్తుతం రూ.1.42 లక్షల కోట్ల అప్పులున్నాయని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు. రాష్ట్రం అప్పులు చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కెసిఆర్ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం 10,500 కోట్లు, అయితే తెలంగాణ రాష్ట్రం సుమారు 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చిందని చెప్పడం హస్యస్పదమని కెసిఆర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు వారసత్వంగా తెలంగాణకు రూ.72వేల కోట్లు వచ్చాయని చెప్పారు.
కాంగ్రెస్ వల్లే అన్యాయం
1999లోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏపీలో కలిపింద,ని కాంగ్రెస్ పార్టీ నేతలేనని ఆయన చెప్పారు.ఆనాడు తెలంగాణ; ఆంధ్రలో విలీనం చేశారని చెప్పారు. తెలంగాణకు మొదటి నుండి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన చెప్పారు. నాగార్జున సాగర్లో తెలంగాణకు అన్యాయం జరగడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని చెప్పారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ చెరువులు, కుంటలు ధ్వంసం అవుతోంటే కాంగ్రెస్ నేతలు చూస్తు కూర్చున్నారని కెసిఆర్ ఆరోపించారు.