పర్మినెంట్ సంగతి దేవుడెరుగు: ఆరునెలలుగా నో పే.. ఇక్కట్లలో వర్క్ ఇన్స్ పెక్టర్లు
‘మిషన్ భగీరథ’ అమలులో ఫీల్డ్ స్టాఫ్గా పనిచేస్తున్న వర్క్ఇన్స్స్పెక్టర్లు పడుతున్న అష్టకష్టాలు ఆ ఏడుకొండల వాడికే తెలియాలి. ఆరునెలలుగా వేతనాలు అందక ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్: ఇంటింటికీ సురక్షిత తాగునీరు సరఫరా చేయకుంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లే అడుగనని ప్రతీన బూనిన నేపథ్యం తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావుది. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో దాదాపు అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా పథకం అమలు చేసిన విజయంతో రాష్ట్రమంతా 'మిషన్ భగీరథ' పేరిట రాష్ట్రమంతటా ఇంటింటికి, పల్లెపల్లెకు నల్లాల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సంకల్పించారు.
ఆ దిశగా ప్రాజెక్టు పనులు వడివడిగా సాగేందుకు ఇంజినీరింగ్ సిబ్బందిని కూడా నియమించుకున్నారు. అంతటి ప్రతిష్ఠాత్మక పథకం 'మిషన్ భగీరథ' అమలులో ఫీల్డ్ స్టాఫ్గా పనిచేస్తున్న వర్క్ఇన్స్స్పెక్టర్లు పడుతున్న అష్టకష్టాలు ఆ ఏడుకొండల వాడికే తెలియాలి. ఆరునెలలుగా వేతనాలు అందక ఆందోళన చెందుతున్నారు.
వర్క్ ఏజెన్సీలు వర్క్ ఇన్స్స్పెక్టర్లకు నెలనెలా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కాగా ఒకవైపు భగీరథ కాంట్రాక్టర్లకు బిల్లులు వెనువెంటనే చెల్లిస్తున్నామని, త్వరితగతిన పూర్తిచేసిన వారికి 20 % అదనంగా ఇన్సెంటీవ్ కూడా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. మరోవైపు అసలు ప్రాజెక్టును పూర్తి చేయడంలో కీలకమైన వర్క్ఇన్స్స్పెక్టర్లు జీతాలు అందక అవస్థలు పడుతున్నారు.
వర్క్ ఇన్స్ పెక్టర్ల నియామకం ఇలా
దాదాపు రెండేండ్ల క్రితం మిషన్ భగీరథ పథకం అమలు చేసేందుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దీనికోసం ప్రత్యేకంగా 26వ నంబర్ జీవో ద్వారా 47 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 662 మంది వర్క్ ఇన్స్స్పెక్టర్లను నియమించింది. ఏడాదిపాటు సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించింది. ఇటీవల మళ్లీ జీవో 444 ద్వారా వారి సర్వీసులను పునరుద్ధరించింది. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల వారీగా 662 వర్క్ ఇన్స్స్పెక్టర్ పోస్టులను భర్తీచేయడానికి స్థానిక ఏజెన్సీలకు అవకాశం కల్పించారు. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, డ్రాయింగ్ల ప్రకారం భగీరథ ట్యాంకులు, పైపులైన్ పనులు చేయించడం వీరి విధి. ప్రతిరోజూ ఫీల్డ్లో తనిఖీలు నిర్వహించడం, రికార్డులు అప్డేట్ చేసి, ఫోటోలు తీసి వెబ్ సైట్లో అప్లోడ్ చేయడం, ఉన్నతాధికారులకు పంపడం తదితర పనులు చేయాలి. ఆయా వర్క్ఏజెన్సీల ద్వారా వారంతా రిక్రూట్ అయ్యారు. తొలుత అందరి సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. ఆనక పీఎఫ్, ఈఎస్ఐ వసతి కల్పించారు. ఇప్పటివరకు తమ సర్వీసులు క్రమబద్ధీకరించకపోగా వేతనాలు సైతం నెలాఖరుకు ఇవ్వడం లేదని వర్క్ఇన్స్స్పెక్టర్లు వాపోతున్నారు.
తాజాగా జీఎస్టీ జరిమానా అదనం
ఒక్కోక్కరికి ప్రతినెలా రోజుకు రూ.735 చొప్పున 25 రోజులకు రూ.18,375 ఇస్తున్నారు. దాదాపు 662 మందికి గత మార్చి నుంచి వేతనాలు బకాయిలు పడింది. కొత్త ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఒక్కొక్కరికి రూ.960 చొప్పున 25 రోజులకు ప్రతినెలా ఇవ్వాలి. అలాగే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ జీవో ప్రకారం 50 శాతం అదనంగా పెంచారు. ఈ మూడు రకాలుగా వర్క్ఇన్స్స్పెక్టర్లకు రూ.31.01 కోట్లు అందాల్సి ఉన్నా, అవి బకాయి పేరుకుపోయాయి. ఆ వేతనాల్లో ఏజెన్సీలకు మరో మూడు శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలావుంటే జీతాలు ఆలస్యంగా చెల్లించడంతో తాజాగా అమలులోకి వచ్చిన జీఎస్టీ జరిమానా కూడా ఉద్యోగులపైనే పడుతున్నది. ప్రతినెలా కట్టాల్సిన పన్ను కాస్త తడిసిమోపెడయ్యే పరిస్థితి ఉంది. వేతనాలకు కోత పడే అవకాశం ఏర్పడింది.
కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ
ప్రస్తుతం భగీరథ ప్రాజెక్టులో అమలవుతున్న రేట్లు సైతం పాత 2014-15 షెడ్యూల్డ్ స్టాండర్డ్ రేట్లు (ఎస్ఎస్ఆర్) ప్రకారమే. 2017-18లో అమలులోకి వచ్చిన ఎస్ఎస్ఆర్ రేట్లు చెల్లించడం లేదు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోలు ఇచ్చినా ఇటు ఏజెన్సీలు పట్టించుకోవడం లేదు. అటు ప్రభుత్వం పర్యవేక్షించడం లేదు. 2014-15 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం వర్క్ఇన్స్స్పెక్టర్లకు రోజుకు రూ. 730 చొప్పున 25 రోజులు చెల్లించాలి. అదే 2016-17 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం రోజుకు రూ. 930 చొప్పున 25 రోజులు ఇవ్వాలి. బీటెక్ డిగ్రీ ఉంటే రూ.18,375, డిప్లొమా ఉంటే రూ.13,750 మేరకు చెల్లిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 14ను ఏజెన్సీలు అమలుచేయడం లేదు.
వేతనాల నిర్ణయంలో తీరొక్క చందం
వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న వర్క్ఇన్స్స్పెక్టర్లకు శాఖల వారీగా వివక్ష ఎదురవుతున్నది. ఒక్కో శాఖలో ఒక్కో తీరున వేతనాలు నిర్ణయించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, తెలంగాణ ఇండిస్టీరియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఐఐసీ)లోనూ పనిచేస్తున్న వేల మంది వర్క్ఇన్స్ ఫెక్టర్లకు తాజా వేతన పెంపుతో కలిపి ప్రస్తుతం నెలకు రూ. 34,750 చెల్లిస్తున్నారు. భగీరథ వర్క్ఇన్స్స్పెక్టర్లకు మాత్రం ఇంకా ఈ జీవోను అమలు చేయడం లేదు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్న వారికి జీవో నంబఱ 14 ద్వారా వేతనాలు పెంచుతూ 2016 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఇప్పటికి ఆ జీవో ను అమలుచేయకుండా పెండింగ్లో పెట్టారు. దీంతో కుటుంబాలను సైతం పోషించుకోలేని దుస్థితి ఏర్పడిందని పేరు రాయడానికి ఇష్టపడని ఓ వర్క్ఇన్స్స్పెక్టర్ వాపోయారు.
10 % జీఎస్టీ జరిమానా చెల్లించాలి
ప్రతినెలా సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడంతో వర్క్ ఇన్స్ పెక్టర్లకు పలు రకాలు సమస్యలు తలెత్తుతున్నాయి. వర్క్ఇన్స్స్పెక్టర్ల లెక్కల ప్రకారం మూడు రకాలుగా వేతనాలు రూ.31.01 కోట్లు రావాలి. బకాయిలు పేరుకుపోయాయి. గతంలో ఉన్న సర్వీసు ట్యాక్స్ 14.5 శాతం నుంచి 18 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. ఆలస్యం కావడంతో మరో 10 శాతం జరిమానా కింద అదనంగా కట్టాల్సి ఉంటుందని సమాచారం. మొత్తం రూ. 31.01 కోట్లకు వర్స్ ఇన్స్ స్పెక్టర్లకు వేతనాలు రావాలి. జీఎస్టీ జరిమానా పన్ను దాదాపు 10 శాతం, వర్క్ ఏజెన్సీ కమిషన్ మరో మూడు శాతం సొమ్ము అంతా కలిపి రూ.5.96 కోట్లు అవుతుందని వర్క్ఇన్స్స్పెక్టర్లు అంటున్నారు. ఇది పోగా మిగిలిన రూ.25.04 కోట్లు వేతనాల కింద చెల్లించాలని పేరు రాయడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి చెప్పారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాలేదని, రాగానే వర్క్ఇన్స్స్పెక్టర్లకు వేతనాలు చెల్లిస్తామని' చెప్పారు.