no lockdown:దేవత పూనిందని చేనులో టెంట్, మహిళను చూసేందుకు బారులుతీరిన జనం...
కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. స్వీయ నియంత్రణ పాటించాలని, సోషల్ డిస్టన్స్ మెయింటైన్ చేయాలని ప్రభుత్వ పెద్దలు పదే పదే కోరుతున్నారు. కానీ కొందరు యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. దీంతో వైరస్ విస్తరిస్తూనే ఉంది. మహబూబాబాద్ జిల్లా బొల్లెపల్లి ప్రధాన రహదారిలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఓ మహిళ తనకు దేవత పూనిందని.. అక్కడే టెంట్ వేసుకొని ఉంటుండగా... ఆమెను చూసేందుకు జనం బారులుతీరారు. దీంతో వైద్యులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు.
రోడ్డు పక్కనే..
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లెపల్లిలో ఘటన జరిగింది. మహిళకు పూనకం రావడంతో.. తన తోటలోనే టెంట్ వేసుకొని ఉన్నారు. ఆమె చేను కేసముద్రం-గూడూరు ప్రధాన రహదారి పక్కనే ఉండటం విశేషం. అయితే ఆమెకు పూనకం వచ్చిందని.. ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది. ఇంకేముంది జనం అంతా గుమిగూడారు. మహిళను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో వారు సామాజిక దూరం పాటించాలనే నియమాన్ని మరచిపోయారు. కానీ విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు అక్కడికెళ్లి.. సోషల్ డిస్టన్స్ మెయింటైన్ చేయాలని కోరారు. అయినా వారు వినిపించుకోలేదు.
చుట్టుపక్కల గ్రామాల నుంచి..
బొల్లెపల్లికి చెందిన ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు కూడా రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా జనం గుమిగూడితే పరిస్థితి ఏంటి అని అంటున్నారు. వైరస్ వ్యాప్తి చెందడంతో దేశవ్యాప్తంగా రెండో దఫా కూడా లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. అందరూ పనులు మానుకొని.. ఇంటిపట్టునే ఉండాల్సింది పోయి.. సామూహికంగా పూజలు చేయడం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు.
2 గుంటల భూమి కోసం..?
అయితే సదరు మహిళ రెండు గుంటల భూమి కోసం ఇలా చేస్తుందని మరికొందరు అంటున్నారు. దీనిపై స్పష్టత లేకున్నా పుకార్లు వినిపిస్తున్నాయి. రోడ్డు పక్కన ఉన్న భూమికి డిమాండ్ ఉండటంతో ఇలా చేస్తుందని అనేవారు కూడా ఉన్నారు. కానీ దీనిపై విచారణ జరిపితే కానీ అసలు విషయాలు తెలియవు. మరోవైపు అక్కడ మహిళ వేసిన టెంట్ తీసి.. జనాన్ని కూడా ఇంటి వద్దకు తరలించాలని నిపుణులు కోరుతున్నారు.
Recommended Video