'విదేశాంగ శాఖ' కాదు, ఎన్నారై శాఖ బలోపేతం.. : స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్ : విదేశాంగ శాఖ ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్న వార్తల్లో నిజం లేదని తెలిసింది. తాజాగా కేటీఆర్ కార్యాలయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కొత్తగా ప్రతిపాదించబోతున్న ఎన్నారై పాలసీతో గతంలో ఉన్న ఎన్నారై వ్యవహారాల శాఖనే బలోపేతం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
పెట్టుబడులకు సంబంధించి ఆయా దేశాలతో రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్దేందుకు దేశంలోనే తొలిసారిగా విదేశాంగ శాఖను ఏర్పాటు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. దీనికి మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తారన్న వాదన కూడా వినిపించింది. అయితే దీనిపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు అలాంటి ప్రయత్నాలేవి జరగట్లేదని ధృవీకరించాయి. దీంతో విదేశాంగ శాఖ ఏర్పాటు విషయం వార్తల్లో ఊహాగానాలకే పరిమితమైంది.
ఇదిలా ఉంటే కొత్త ఎన్నారై పాలసీపై త్వరలోనే కేబినెట్ సమావేశం నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ ఆమోదం పొందగానే కొత్త ఎన్నారై పాలసీ అమలులోకి రానున్నట్టు సమాచారం.