కాంగ్రెస్ పార్టీకి నో సపోర్ట్.. హుజుర్నగర్లో పోటీ చేస్తాం : తమ్మినేని
నల్గొండ : హుజుర్నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పక్షమైన టీఆర్ఎస్ ఇక్కడి బై పోల్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. తమకు కంచుకోటైన కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారిని బరిలోకి దించి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ క్రమంలో బీజేపీ కూడా నేను సైతం అంటూ ఎన్నికల సమరంలో కాలు దువ్వుతోంది.
అదంతా ఒక ఎత్తైతే.. తాము కూడా పోటీకి సై అన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. హుజుర్నగర్ బై పోల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. సీపీఎం తరపున అభ్యర్థిని రంగంలోకి దించుతామని ప్రకటించారు. హుజుర్నగర్లో శుక్రవారం నాడు జరిగిన సీపీఎం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
1000 కేసులు.. 14 రాష్ట్రాల పోలీసులకు చుక్కలు.. నెల్లూరులో చిక్కిన ఏటీఎం క్లోనింగ్ క్రిమినల్..!
హుజుర్నగర్ ఉప ఎన్నికల అంశంపై సమావేశంలో ప్రస్తావించారు తమ్మినేని. బై పోల్స్లో పోటీ చేయడానికి తమ పార్టీ సంసిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే తమ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై తెలంగాణ జన సమితి, టీడీపీ, సీపీఐ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. తమతో కలిసి వచ్చే పార్టీ నేతలతో చర్చించి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.
శాసన సభలో వామపక్ష పార్టీల నేతలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు తమ్మినేని. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోంటే ప్రశ్నించే గొంతుక లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపేందుకు అసెంబ్లీలో ఒక బలమైన గొంతుక ఉండాలనే ఉద్దేశంతోనే హుజుర్నగర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ విధానాలను.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తామని చెప్పారు.