సింగరేణి ప్రైవేటీకరణపై పార్లమెంటులో తేల్చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: సింగరేణి బొగ్గుగనుల వేలంపై లోక్సభలో అధికార, విపక్షాల మధ్య స్వల్ప మాటల యుద్ధమే చోటు చేసుకుంది. సింగరేణి బొగ్గు గనిని ప్రైవేటు పరం చేస్తోందంటూ గత కొంత కాలంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లోనూ ప్రస్తావించారు.
సింగరేణి ప్రైవేటీకరణపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న
శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే బుధవారంనాడు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో సింగరేణిలోని పలు గనులను వేలం వేయడంపై కేంద్రం పార్లమెంటులో వివరణ ఇచ్చింది. సింగరేణి సంస్థలో కేంద్రం, తెలంగాణకు ఉమ్మడి ఓనర్ షిప్ ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు.
సింగరేణి ప్రైవేటీకరణ ఎలా సాధ్యమన్న కేంద్రమంత్రి జోషి
తెలంగాణ ఎంపీల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్ధరహితమన్నారు కేంద్రమంత్రి జోషి. బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణపై ఉత్తమ్ కుమార్ రెడ్డి జీరో అవర్ లోనే లేవనెత్తారు. దీంతో సభలోనే కేంద్రమంత్రి జోషి ప్రకటన చేశారు. సింగరేణి కాలరీస్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం ఉండగా.. 49 శాతంవాటా కలిగిన కేంద్రం ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదంటూ కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
గనుల వేలాన్ని అక్రమార్కులే వ్యతిరేకిస్తున్నారన్న ప్రహ్లాద్ జోషి
బొగ్గు గనుల కేటాయింపులో పూర్తి పాదర్శకతతో నిర్వహిస్తున్నామని, వేలం ప్రక్రియపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదన్నారు. వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులు జరుపుతున్న రాష్ట్రాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. దీంతో అనేక రాష్ట్రాలు గనుల వేలానికి పూర్తిగా సహకరిస్తున్నాయంటూ వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కానటువంటి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా వేలం పద్ధతిని అందిపుచ్చుకున్నాయని తెలిపారు. వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళ్తుందన్నారు. బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారంటూ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తేల్చి చెప్పారు.