కిరాయిగాళ్లను తీసుకొచ్చి షో: రాహుల్ పర్యటనపై దానం, బీజేపీ విమర్శలు
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ మంగళవారం స్పందించారు. రాహుల్ ఏ రాష్ట్రంలో పర్యటిస్తే ఆ రాష్ట్రంలో ఆ పార్టీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు.
ఆయన పర్యటన వల్ల తెలంగాణకు గానీ హైదరాబాదు నగరానికి గానీ ఒరిగిందేమీ లేదని విమర్శించారు. చచ్చిన పార్టీకి మెరుగులు దిద్దడం కోసమే ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారని చెప్పారు. డాక్టర్ కే లక్ష్మణ్, ఇతర బీజేపీ నేతలు సికింద్రాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలకు బీజేపీ నేతలు వివరించారు. మౌలిక సదుపాయాలు లేక హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు పెట్టింది పేరన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాదులో బీజేపీ ఎక్కువ స్ధానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Recommended Video
రాహుల్ గాంధీ పర్యటన ఏమీ ఉద్దరించదని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉందా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. కుటుంబ పాలన గురించి రాహుల్ మాట్లాడటం విడ్డూరమన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు టిక్కెట్ ఆశిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదన్నారు. సెటిలర్ల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. అంతా కిరాయిగాళ్లను తీసుకు వచ్చి షో చేశారని విమర్శించారు.