నా పెళ్లికి రండి.. గిఫ్ట్లు వద్దు.. మోడీకి ఓటేయండి: తెలంగాణ యువకుడు
హైదరాబాద్: గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల పలువురు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభిమానులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిమానులు 2019లో కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని, తమకు బహుమతులు తీసుకు రావాల్సిన అవసరం లేదని, బీజేపీకి ఓటు వేయడమే తమకు బహుమతి అని తమ తమ పెళ్లి కార్డులలో ప్రింట్ చేయిస్తోన్న విషయం తెలిసిందే.
యోగి ఫ్యామిలీకి హ్యాట్సాప్: జాబ్మేళాకు అందరిలా క్యూలో మేనకోడళ్లు, ఆదిత్యనాథ్ రికమెండ్ చేసినా నో!
మోడీకి ఓటేయమని పెళ్లి పత్రికలో ప్రింట్
తాజాగా, తెలంగాణలో కూడా ఓ యువకుడు తన పెళ్లికి బీజేపీకి ఓటు వేయాలని తన పెళ్లి కార్డులో ప్రింట్ చేయించాడు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మీ ఓటు మోడీకి వేయండి. మా పెళ్లికి మీరు ఇచ్చే కానుకే ఇదే... అంటూ శంషాబాద్ నివాసి యండె సుభాష్ రావు నాలుగో కుమారుడు ముఖేష్ తన వివాహ ఆహ్వాన పత్రికలో ముద్రించి ప్రత్యేకత చాటారు.
దేశం కోసం పని చేస్తోన్న మోడీకి మద్దతుగా
ఈ నెల (ఫిబ్రవరి) 21వ తేదీన ఆయన వివాహం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని, తాను ఆయన అభిమానిని అని, ఇలా ఆయనకు మద్దతివ్వడం ద్వారా దేశం కోసం ఎంతో కొంత చేద్దామనే భావనతోనే ఇలా ముద్రించానని ముఖేష్ చెబుతున్నారు.
ఓటు వేయడమే పెద్ద గిఫ్ట్
మోడీకి ఓటు వేయడమే తమకు పెద్ద గిఫ్ట్ అని ముఖేష్ తండ్రి సుభాష్ రావు చెబుతున్నారు. తన కొడుకు, తాను ఇద్దరం కూడా దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తున్న మోడీకి అభిమానులమని చెప్పారు. కాగా, ముఖేష్కు అనూష అనే యువతితో పెళ్లి జరగనుంది. దాదాపు వెయ్యి కార్డులు కొట్టించారు. వాటిలో బీజేపీకి ఓటు వేయమని కోరారు.