‘పద్మ’ పురస్కారానికి తెలంగాణలో అర్హులే లేరా? కేటీఆర్, కవిత స్పందించరేం?: పొన్నం ప్రభాకర్
‘పద్మ’ పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటీ రాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ‘పద్మ’ పురస్కారానికి తెలంగాణలో ఒక్కరు కూడా అర్హులు లేరా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన 'పద్మ' పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటీ రాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'పద్మ' పురస్కారాన్ని అందుకునేందుకు తెలంగాణలో ఒక్కరు కూడా అర్హులు లేరా? అని ప్రశ్నించారు. అసలు తెలంగాణకు 'పద్మ' పురస్కారాలు దక్కకపోవడానికి కారణాలేంటో టీఆర్ఎస్ సర్కార్ చెప్పాలని డిమాండ్ చేశారు.
పెద్దనోట్ల రద్దు, రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని, అంతే కాకుండా పార్లమెంట్లో బీజేపీ లేవనెత్తిన ప్రతి అంశానికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని పొన్నం తెలిపారు.
అయినా 'పద్మ' పురస్కారాల్లో కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపిందని, ప్రతి అంశానికి ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించే కేటీఆర్, కవితలు.. ఈ విషయమై స్పందించరేమని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.