‘అంతా ఏపీ కోసమేనా? తెలంగాణను పట్టించుకోరా?’: టీఆర్ఎస్ ఎంపీల నిలదీత
న్యూఢిల్లీ: విభజన హామీలు నెరవేరడం లేదంటూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీశారు. టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, బండా ప్రకాశ్ మంగళవారం రాజ్యసభలో విభజన హామీల అమలుపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో పాల్గొని తమ వాదనను వినిపించారు.
'సభలో కేవలం ఏపీకి ప్రత్యేక హోదాపై మాత్రమే చర్చిస్తున్నారు. తెలంగాణ గురించి ఎవరూ ఆలోచించడం లేదు' ఎంపీ బండా ప్రకాష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'విభజన చట్టంలో తెలంగాణకు కూడా చాలా హామీలు ఇచ్చారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, పోలవరం బాధితులకు పరిహారం వంటి హామీలను కేంద్రం విస్మరించింది' అని ప్రకాశ్ చెప్పారు.
కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని అన్నారు. మిషన్ భగీరథకు రూ. 13 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని, ఐనా ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదని బండా ప్రకాశ్ తెలిపారు.
'తెలంగాణ 70 ఏళ్లపాటు దోపిడీకి, వెనుకబాటుకు గురైన ప్రాంతం. గత ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ను మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదు . విస్మరణకు గురైన తెలంగాణ ప్రాంతానికి ఈ సభలోనైనా న్యాయం చేయాలి' అని బండా ప్రకాశ్ కోరారు.
తెలంగాణకు విరుద్ధంగా ఎన్నో అంశాలు: కేకే
విభజన బిల్లులో తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఎన్నో అంశాలున్నాయని ఎంపీ కే కేశవరావు అన్నారు. ఏపీ సర్కారు హైకోర్టు కట్టుకుంటే తప్ప.. తమ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఉందని తెలిపారు. తాము హైకోర్టు గురించి ఎపుడు అడిగినా కేంద్ర న్యాయశాఖ నుంచి సమాధానం రాని పరిస్థితి అని అన్నారు.
'హైకోర్టును ఇప్పటివరకు విభజించలేదు. నీటి కేటాయింపుల అమలులో నిర్లక్ష్యం వల్ల మా రాష్ట్రం ఎంతో నష్టపోతుంది. తెలంగాణకు ఇవ్వాల్సిన కరెంట్ను కూడా ఏపీ ఇవ్వలేదు. దీనిపై పిర్యాదు చేసినా కేంద్రం మాకు ఎలాంటి సహాయం చేయలేదు' అని కేకే కేంద్రంపై మండిపడ్డారు.
ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్న వారు.. తెలంగాణకు జరిగిన అన్యాయంపై నోరు విప్పరేమని కేకే ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన సీలేరు ప్రాజెక్టు, 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎంపీ కేకే డిమాండ్ చేశారు.