జానారెడ్డి! టీఆర్ఎస్లోకి వస్తే నా స్థానం నీదే, లేదంటే ఓటమి ఖాయం: నోముల
హైదరాబాద్: టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వస్తే టిక్కెట్ త్యాగం చేస్తానని నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఉచితంగా ఇరవై నాలుగు గంటలూ విద్యుత్ అందిస్తున్నారని అన్నారు. ఈ విషయమై నాడు జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను నోముల ప్రస్తావించారు.
నిరూపిస్తే రాజకీయ సన్యాసమే: కేసీఆర్కు జానారెడ్డి సవాల్
నాడు జానారెడ్డి చెప్పిన ప్రకారం టీఆర్ఎస్కు ఆయన ప్రచారం చేయాలని, బత్తాయి రైతులు ఆనందంగా ఉన్నారా? లేరా? అన్న విషయం జానారెడ్డే చెప్పాలని అన్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలనూ టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, నాగార్జున సాగర్లో జానారెడ్డి ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.
'మా నాయకుడు కేసీఆర్ ఏం చెప్పినా వింటాం. కరెంటు విషయంపై మీరు(జానారెడ్డి) అప్పుడు జోష్లో అన్నారు. అది గుర్తు చేసుకోండి. ప్రజా తీర్పు కోసం శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. కేసీఆర్ కిట్ వల్ల ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది' అని నోముల అన్నారు.