ఆ పోలీస్ అధికారి ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు
Recommended Video
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ప్రగతి భవన్ ముట్టడి రోజు విధులు నిర్వర్తించిన ఎస్ఐ నవీన్ రెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారని రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 341, 322 తో పాటుగా 353 నాన్ బెయిలబుల్ సెక్షన్ క్రింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగాసోమవారం నాడు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇక దాంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కీలక నాయకులను ఇళ్ల వద్దే హౌజ్ అరెస్ట్ చేయగా, మరికొందరిని పోలీసులు ప్రగతి భవన్ వద్ద అరెస్ట్ చేశారు.
ఇక ఆరోజు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం దూకుడు చూపించారు. బైక్ పై వచ్చి ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ఇక ఆరోజు జూబ్లీహిల్స్ లోని రోడ్ నెం.48లోని రేవంత్రెడ్డి నివాసం వద్ద తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్ పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆయనను హౌజ్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు, జూబ్లీహిల్స్ ఇన్ స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి, సెక్టార్ ఎస్ఐ నవీన్ రెడ్డి తదితరులు ఆయన ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన బయటకు రాకుండా చేశారు. కానీ రేవంత్ రెడ్డి పోలీసుల ఆదేశాలను లెక్క చెయ్యకుండా బయటకు వచ్చారు.
రేవంత్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ నవీన్ రెడ్డితో పాటు పలువురు పోలీసులను తోసుకుంటూ వేగంగా అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ తోపులాట ఘటనలో ఎస్ఐ నవీన్ రెడ్డికి గాయాలయ్యాయి. ఇక ఎవరినీ లెక్క చెయ్యకుండా పోలీసులను తోసుకుంటూ బైక్ పై రేవంత్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు.అక్కడ ఒక్కసారిగా రేవంత్ రావటంతో ఆందోళనకారులు పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక ఈ విషయంలో గాయపడిన ఎస్సై ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది.