కేఏ పాల్ అడ్డంగా దొరికిపోయారు..! తొమ్మిదేళ్ల తరువాత తెర మీదికి ఆ కేసు
మహబూబ్ నగర్: ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మహబూబ్ నగర్ న్యాయస్థానం సోమవారం ఉదయం ఈ మేరకు ఈ వారెంట్ ను ఇచ్చింది. తన సోదరుడి హత్యకేసులో అనుమానితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటున్న కేఏ పాల్.. తదుపరి విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొడుతుండటంతో మహబూబ్ నగర్ జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. కేఏ పాల్ ఎక్కడ ఉన్నా వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు.
కేఏ పాల్ సోదరుడు డేవిడ్ రాజు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మహబూబ్ నగర్ జిల్లా కొమ్మిరెడ్డి పల్లి సమీపంలో ఓ కారు నుంచి డేవిడ్ రాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ హత్య కేసులో కేఏ పాల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మిగిలిన నిందితులు క్రమంగా తప్పకుండా న్యాయస్థానానికి హాజరువుతున్నప్పటికీ. కేఏ పాల్ మాత్రం విచారణకు ఒక్కసారి కూడా హాజరైన సందర్భాలు లేవు. దీనితో మహబూబ్ నగర్ న్యాయస్థానం ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది.
డేవిడ్ రాజు స్వయానా కేఏ పాల్ సోదరుడు. వారిద్దరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో డేవిడ్ రాజు హత్య చోటు చేసుకుని ఉంటుందని అప్పట్లో పోలీసులు అనుమానించారు. ఆస్తి తగాదాల కారణంగానే డేవిడ్ రాజును కేఏ పాల్ హత్య చేసి ఉంటాడని పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కోసం హాజరవ్వాల్సిందిగా మహబూబ్ నగర్ న్యాయస్థానం కేఏ పాల్కు పలు మార్లు సమన్లనుం పంపించింది. ఏ ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీనితో నాన్ ముందస్తు బెయిల్ కు అవకాశం లేని విధంగా అరెస్ట్ వారెంట్ జారీచేసింది న్యాయస్థానం.