కల్నల్ సంతోష్ బాబుకు మహవీర్ చక్ర పట్ల తండ్రి అసంతృప్తి, గర్వంగా ఉందంటూ భార్య సంతోషి
హైదరాబాద్: కేంద్ర తన భర్తకు మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించడం పట్ల గర్వంగా ఉందని గల్వాన్ ఘటనలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం గణతంత్ర వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
సంతోష్ బాబు సతీమణికి సన్మానం..
గల్వాన్ లోయలో చైనా సైనికుల దాడిని వీరోచితంగా తిప్పికొడుతూ అమరుడైన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు సతీమణి సంతోషిని ఈ సందర్భంగా కలెక్టర్ సన్మానించారు. సంతోష్ బాబుకు కేంద్రం మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆయన సతీమణి, శిక్షణా కలెక్టర్ సంతోషిని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత శాలువాతో సత్కరించారు.
భర్తకు మహవీర్ చక్ర పురస్కారం గర్వంగా ఉందంటూ సంతోషి
ఈ సందర్భంగా సంతోషి మాట్లాడుతూ.. తన భర్తకు కేంద్రం మహావీర్ చక్రను ప్రకటించడం గర్వంగా ఉందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తన భర్త అందరికీ ప్రేరణగా ఉంటారని తెలిపారు. తన పిల్లలు వారి తండ్రిని చూసి గర్విస్తున్నారన్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు. తమకు అండగా నిలిచిన తెలంగాణ సర్కారుకు సంతోషి ధన్యవాదాలు తెలిపారు.
సంతోష్ బాబుకు మహావీర్ చక్ర పురస్కారంపై తండ్రి అసంతృప్తి
ఇది ఇలావుండగా, కేంద్రం మహవీర్ చక్ర పురస్కారం ప్రకటించడంపై సంతోష్ బాబు తండ్రి బీ ఉపేంద్ర కూడా స్పందించారు. అవార్డు ప్రకటించడంపై తాను అసంతృప్తి లేనని, అయితే, 100 శాతం సంతృప్తి కూడా లేదని చెప్పారు. తన కుమారుడిని మరింత గౌరవించే అవకాశం ఉందని అన్నారు. అత్యున్నత మిలటరీ పుస్కారమైన పరమ్ వీర్ చక్ర పురస్కారాన్ని సంతోష్ బాబుకు ప్రకటించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. రక్షణ దళాలతోపాటు దేశంలోని చాలా మందికి తన కుమారుడు ఆదర్శంగా నిలిచాడని అన్నారు.
ఒట్టి చేతులతోనే పోరాడారు.. సత్తాను చాటి చెప్పారు
తన కొడుకు, అతని సహచరులు ఉట్టి చేతులతోనే పోరాడి చైనాకు తగిన గుణపాఠం చెప్పారని, చైనా కంటే మన భద్రతా బలగాలు బలంగా ఉన్నాయని చాటి చెప్పారని సంతోష్ బాబు తండ్రి ఉపేంద్ర తెలిపారు. కాగా, అమరులైన సైనికులకు కేంద్రం నుంచి వచ్చే సాయం మాత్రమే తాము పొందామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5 కోట్ల ఎక్స్గ్రేషియాతోపాటు సంతోషికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం, రెసిడెన్షియల్ ప్లాట్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
ఫోటోలు: ఏపీలో 72వ గణతంత్ర వేడుకలు: హాజరైన గవర్నర్ హరిచందన్ సీఎం జగన్