అలుముకున్నవి కారు మబ్బులు కాదు.!కరోనా మబ్బులు.!తరిమికొట్టడమా.?తడిసి పోవడమా.?
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కరోనా మహమ్మారి గంటగంటకు విస్తరిస్తోంది. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా వైరస్ ను కట్టడి చేయలేక సతమతమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకూ ధైర్యంగా ఉన్న ప్రజలు వర్షాకాలం వచ్చే సరికి కరోనా ఎక్కడ విజృంభిస్తుందోనని భయ భ్రాంతులకు గురవుతున్నారు.
ఇది మహా ప్రళయం.. అప్రమత్తంగా ఉండకపోతే అదఃపాతాళానికే..
కరోనా ఏమీ చేయదులే అనే భరోసా వ్యక్తం చేసిన నగర వాసులు ఒక్కసారిగా ఢీలా పడిపోయి కరోనా మహమ్మారికి గజగజావణికిపోతున్న సందర్బాలు తలెత్తుతున్నాయి. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కరోనా పంజావిసురుతున్నట్టు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా మరోసారి లాక్డౌన్ దిశాగా చర్యలు తీసుకోబోతున్నట్టు పెద్ద యెత్తుల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకు తగ్గట్టే వలస కూలీల తరలింపులో కేంద్రం డెడ్ లైన్ విధించి రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిందనే చర్చ జోరుగా సాగుతోంది.
నగరంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం.. కరోనా ముందస్తు చర్యలపై ఆరా..
నగరంలో క్రమ క్రమంగా పెరిగిపోతున్న కేసులు ప్రభుత్వ యంత్రాంగంతోపాటు సామాన్య ప్రజానికాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదవుతుండం పట్ల ప్రభుత్వ అదికారులు తలలు పట్టుకుంటున్నారు. అంతే కాకుండా గ్రేటర్ పరిధిలో కరోనా కట్టడి చర్యలపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో కేంద్ర బృందం భేటీ అయింది. తెలంగాణలో నమోదవుతున్న కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య అంశంలో కేంద్ర ప్రభుత్వం మొదటినుండి సంశయాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది.
తెలంగాణతో సహా దేశంలో పెరిగిపోతున్న కేసులు.. ఆవేదన వ్యక్వం చేస్తున్న కేంద్ర బృందం..
దీంతో పాటు హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు జెట్ స్పీడ్ వేగంతో పెరుగుతుండటంపై కేంద్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడి పరిస్థితులపై ఆరా తీసేందుకు కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యింది. బృందం సభ్యులు వికాస్ గాడే, డా.రవీందర్లతో కలిసి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ బి.సంతోష్, సీసీపీ దేవేందర్రెడ్డి, కోవిడ్-19 కంట్రోల్ రూం ఓఎస్డీ అనురాధ సమావేశమయ్యారు. గ్రేటర్ పరిధిలో ఇదే విధంగా కేసులు నమోదైతే జులై 31నాటికి పరిస్థితి తీవ్రంగా మారుతుందని జీహెచ్ఎంసీ అధికారులను కేంద్ర బృందం ఘాటుగా హెచ్చరించినట్టు తెలుస్తోంది.
వచ్చింది వర్షాకాలం.. జాగ్రత్తగా ఉండడమే క్షేమం అంటున్న కేంద్రం..
కంటైన్ మెంట్ తో పాటు కరోనా కేసుల చికిత్స, రెడ్ జోన్లలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పూర్తి స్థాయిలో కేంద్రం వివరాలు సేకరించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు, వైద్య అధికారులు, డిప్యూటీ కమిషనర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు వివరణ ఇచ్చారు. ప్రైవేట్ పరీక్షల్లో 70 శాతం పాజిటివ్ కేసులుగా వస్తున్నాయని, కరోనా కట్టడికి హోం కంటైన్మెంట్ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రజల సహకారం చాలా కీలకమని అన్నారు. ప్రజలందరూ కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించకుండా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గంటగంటకూ పెరుగుతున్న కరోనా వైరస్ నుండి బయటపడాలంటే ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని స్పష్టం చేసారు.