స్వర్ణలత రంగం: కామ, కోపంతో కాదు భక్తిభావంతో పూజలు, 5 వారాలు నిష్టగా, సాకా, పప్పు బెల్లం...
పాపాలు పెరిగిపోవడంతోనే కరోనా వైరస్ వచ్చిందని మహంకాళి రంగంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఎవరి పాపాలను వారు అనుభవించిక తప్పదు అని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందులు తప్పవు అన్నారు. ప్రజలు ఈ స్థితిలో ఉండటంతో తనకు సంతోషం లేదన్నారు. తాను కూడా దు:ఖిస్తున్నానని పేర్కొన్నారు. పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్పారు స్వర్ణలత. కరోనా వైరస్ నివారణ కోసం ఏం చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రధాన పూజారి కోరగా.. అమ్మవారు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు.
నేనున్నా..
కరోనా కట్టడి చేసేందుకు తాను ఉన్నానని రంగంలో స్వర్ణలత చెప్పారు. కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే తనను భక్తిభావంతో కోలిస్తే వైరస్ దూరం చేస్తానని చెప్పారు. కామంతో కొలువొద్దని.. కోపంతో పూజించొద్దని తెలిపారు. మనస్సులో నిండుగా భక్తితో పూజలు చేయాలని కోరారు. యజ్ఞ హోమాలు జరపాలని.. 5 వారాలు తనను నిష్టగా కొలవాలని కోరారు. సాకాలు తీసుకురావాలని.. 7 రోజులు గడప గడప నుంచి బెల్లం, పప్పు తీసుకురావలని తెలిపారు.
గంగాదేవికి యజ్ఞ హోమం
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూజారి ప్రస్తావించగా.. గంగాదేవికి యజ్ఞ హోమాలు నిర్వహించాలని స్వర్ణలత తెలిపారు. దీంతో రాష్ట్రానికి మేలు జరుగుతోందని.. పల్లెలు పచ్చగా ఉంటాయని సెలవిచ్చారు. గంగాదేవి ఆశీర్వాదం తీసుకోవాలని స్వర్ణలత రంగాన్ని ముగించారు. తర్వాత అక్కడున్న భక్తులు... అమ్మవారిని స్తుతించారు.
భక్తిభావంతోనే..
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దేశంలో.. తెలంగాణలో ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక హైదరాబాద్లో అయితే చెప్పక్కర్లేదు. రోజుకు కనీసం వెయ్యి, అంతకన్నా ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ సమయంలో అమ్మవారు కామా, కోపాలతో కాక.. నిష్టతో పూజ చేయాలని కోరారు. సాకా సమర్పించి, పప్పు, బెల్లంతో గడప గడప పూజిస్తే కాపాడుతానని చెప్పారు. కానీ భక్తి భావంతోనే తనను కొలవాలని స్పష్టంచేశారు.