అమెరికాలోను కరవు ఉంది: ఎంపీ బూర, జీడిమెట్ల కాలుష్యంపై వివేక్ ఆందోళన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరవు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే లేదని, అమెరికాలోను ఉందని చెప్పారు. కరవు పైన ప్రభుత్వం ఏం చేయాలో అదంతా చేస్తోందన్నారు.
విదేశాల్లో ఉన్న తెలంగాణ వారు తమ సంస్కృతీ సంప్రదాయాలను మరిచిపోలేదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. విదేశాల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారన్నారు.
ఎక్కడెక్కడో స్థిరపడ్డ తెలంగాణ ఎన్నారైలు ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు. విదేశాల్లో తెలంగాణ విద్యార్థులు వేల సంఖ్యలో చదువుకుంటున్నారని, అక్కడ వారికి అనేక ఇబ్బందులున్నాయన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం తాను సీఎంతో చర్చిస్తానన్నారు.
విదేశాల్లో చదువుకుంటోన్న తెలంగాణ విద్యార్థులు ఐదుగురు ఉండాల్సిన నివాసాల్లో ఇరవై ఐదుమంది వరకు ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని, తమ కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత తెలంగాణ విద్యార్థులు ఇక్కడకు రావాలన్నారు. వారికి అన్ని వసతులు కల్పిస్తామన్నారు.
ఆన్లైన్లో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు వైద్యులు ముందుకొస్తున్నారని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి: ఎర్రబెల్లి, మండవ
రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మండవ వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో రైస్ మిల్లులు మూతబడే ప్రమాదం ఉందన్నారు. ఈ సమస్యను అసెంబ్లీలో లేవనెత్తుతామన్నారు. మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రైస్ మిల్లర్లు ఇబ్బందుల్లో ఉన్నందున ట్యాక్సులు ఎత్తివేయాలన్నారు. మిల్లర్ల సమస్యలను కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వమే మాట్లాడాలన్నారు.
కాలుష్యానికి బలి: ఎమ్మెల్యే వివేక్
జీడిమెట్ల, బాచుపల్లి పరిధిలో ప్రజలు కాలుష్యానికి బలవుతున్నారని ఎమ్మెల్యే వివేక్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల కాలుష్యానికి పిల్లలు, గర్భిణీలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. పిసిబి నివేదికలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. హెటిరో, రెడ్డీస్ వంటి పలు ఫార్మా సంస్థలు నిబంధనలు పాటించడం లేదన్నారు.