మహిళల గొలుసులే కాదు..! మగాళ్ల చైన్లు కూడా లాగేస్తారు..! రూట్ మార్చిన స్నాచర్లు..!!
హైదరాబాద్: చైన్ స్నాచర్లు రూటు మార్చారు. మహిళలను కాకుండా ఇప్పుడు పురుషులను టార్గెట్ చేసుకుని వాళ్ల మెడలోని గొలుసులను లాగేస్తున్నారు. కాస్త ఆర్థికంగా స్తిరపడిన, లేదా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే పురుషులు మెడలో ఓ బంగారు గొలుపు వేళాడేసుకోవడం నగరంలో సర్వ సాధారణం. అలాంటి వారిపై కన్నేసారు కన్నింగ్ కేటుగాళ్లు. మహిళలు కాకుండా పురుషుల మెడలో చైన్ కనపడిందో దాన్ని మాయం చేయాల్సిందే..! రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతోంది ఓ ముఠా..! చైన్ వేసుకున్న పాపానికి పురుషుల మెడలకు రక్తపు మరకలు చేస్తున్న ఈ కొత్త రకం దొంగలు ఎవరో ఎలా మాటు వేసి చైన్లు లాగేస్తారో తెలుసుకుందాం..!
పురుషుల మెడల్లో గొలుసులు మాయం..! నగరంలో కాంబ్లె ముఠా దురాగతాలు..!!
కాంబ్లె ముఠా కన్నేసిందంటే, పురుషుల మెడల్లోని గొలుసులు మాయం కావాల్సిందే. ముఠాలో మొత్తం తొమ్మిది మంది ఉంటారు.చోరీ చేసేందుకు అయిదుగురు బస్సెక్కుతారు. మెడలో గొలుసు ఉన్న వ్యక్తిని లక్ష్యం చేసుకుంటారు. ఫుట్బోర్డుపై ఉన్నవారి మెడల్లో నుంచి ఇంకా సులువుగా గొలుసులను దోచేస్తారు. లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తి ముందు ముగ్గురు, వెనుక ఇద్దరు నిల్చుంటారు. మధ్యలో ఉన్న వ్యక్తిని ఊపిరి సలపనంత ఒత్తిడికి గురి చేస్తారు. ఈ క్రమంలో అతను ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా వెనుక ఉన్న వ్యక్తి నెమ్మదిగా గొలుసును లాగి పళ్లతో కొరికి, బస్సు కుదుపులకు గురయ్యే సందర్భంలో లాగేస్తాడు. పని కాగానే వచ్చే బస్టాప్లో అయిదుగురూ నెమ్మదిగా దిగి జారుకుంటారు.
మఫ్టీలో పోలీసులు బస్సులో ప్రయాణం..! వల వేసి పట్టుకున్న సిటీ కాప్స్ ..!!
బస్సులో గొలుసులు పోయాయనే ఫిర్యాదులు ఎక్కువగా రావడంపై పోలీసులు దృష్టి సారించారు. బాధితులు చెప్పిన వివరాల మేరకు నిందితుల పోలికలతో పాత నేరస్థుల ఫొటోలు తీయించి బస్టాండ్లలో పెట్టి ప్రచారం చేశారు. ఆ మేరకు లక్డీకాపూల్లోని బస్టాప్లో అనుమానితులు ఉండటాన్ని సైఫాబాద్ పోలీసులు గుర్తించారు. ఆ బృందం సభ్యులతో పాటు పోలీసులూ బస్సెక్కారు. వంద అడుగులు దూరం వెళ్లగానే సైఫాబాద్ ఠాణా ఎదుట బస్సును ఆపి అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
కాంబ్లే గ్యాంగ్ క్రూరత్వం..! చైన్ కనపడితే మెడను కొరికేస్తారు..!!
వారిని విచారించగా ‘కాంబ్లె శ్యామ్సుందర్ గ్యాంగ్'గా చలామణీ¨ అవుతూ ఎనిమిది చోరీలు చేసినట్లు తేలింది. రెండు నెలలుగా ఇలా చోరీలు చేస్తున్నారు. ప్రస్తుతానికి 70 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నారు. సొత్తును మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఒకే బస్తీకి చెందిన ముఠా, శ్యామ్సుందర్ గ్యాంగ్గా చలామణీ అవున్న ఈ బృందం మల్లేపల్లిలోని అఫ్జల్సాగర్ కు చెందినదిగా గుర్తించారు. ఇరవై నాలుగేళ్ల కాంబ్లె శ్యామ్సుందర్ అలియాస్ శ్యామ్, ఇరవై ఏడేళ్ల కాంబ్లె దశరథ్ అలియాస్ రాజు, ఇరవై ఏళ్ల కాంబ్లె లక్కీ, పందొమ్మిదేళ్ల బి.సాయికుమార్, పందొమ్మిదేళ్ల అరుణ్ రాజ్ గీతా భరత్ ఇందులో సభ్యులు. మరో నలుగురు పరారీలో ఉన్నారు.
గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..! లోతుగా దర్యాప్తు..!!
కాంబ్లె శ్యామ్సుందర్ పాత నేరస్థుడు. ఇతనిపై గతంలో 22 కేసులున్నాయి. పీడీ చట్టం ఏడాది జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలయ్యాక పది మందితో ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవీ ఇటీవలి దొంగతనం తాలూకా వివరాలు..! వెంకట నర్సింహ జనవరి 19న మెహిదీపట్నం వెళ్లే బస్సులో ఉండగా లక్డీకాపూల్లో కొందరు గొలుసు చోరీ చేశారు. జనవరి 21న బంజారాహిల్స్లోని రోడ్డు నంబరు 1/12 సమీపంలో రద్దీ బస్సులో మిథున్ చక్రవర్తి మెడలోని గొలుసు పోయింది. హరీశ్రెడ్డి ఫిబ్రవరి 9న బస్సులో ఉండగా గొలుసు అదృశ్యమైంది. అదే రోజు శంకర్రావు అనే వ్యక్తి రద్దీ బస్సులో గొలుసు పోయినట్లు నాంపల్లి దగ్గర గుర్తించాడు. ఇటీవల సైఫాబాద్లో 4, నాంపల్లిలో 2, నారాయణగూడలో 1కేసు నమోదయ్యాయి. ఈ ఉందంతాల పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.