అధిష్టానానికి చెప్పుకోలేని స్థితి: ఎమ్మెల్సీ అభ్యర్థి జంప్పై జగ్గారెడ్డి
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకంతోనే మెదక్లో తమ పార్టీ అభ్యర్ధిని బరిలో దించామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తూర్పు జయప్రకాశ్రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన శివరాజ్పాటిల్ ఊహించని రీతిలో పార్టీకి షాక్ ఇచ్చారు.
పోటీ నుంచి శుక్రవారం వైదొలగడమే కాకుండా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరిపోయారు. ఈ పరిణామానికి జగ్గారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
పార్టీ అభ్యర్థి వ్యవహరించిన తీరుపై తాము పార్టీ హైకమాండ్కు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. మెదక్లో తమ అభ్యర్ధి గెలుపునకు మెజారిటీ ఉందని, అయితే అధికార పార్టీ మా అభ్యర్ధిని ప్రలోభ పెట్టిందన్నారు.
తమ అభ్యర్ధి పోటీ నుంచి తప్పుకున్న ఉదంతాన్ని ఊహించలేక పోయామని ఆయన చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, ఇలాంటి సంప్రదాయాలతో మీరు కూడా ఇబ్బంది పడాల్సివస్తుందని ఆయన టీఆర్ఎస్ నేతలకు సూచించారు.